రంగు పడుద్ది..

2 Nov, 2017 08:31 IST|Sakshi
పసుపురంగులో ఉన్న జాబ్‌కార్డులు

ఉపాధి కార్డులు, పంచాయతీ

భవనాలు, ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులకు పసుపు రంగు  

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సర్కారు తీరుపై విమర్శల వెల్లువ

జిల్లాలోని ప్రభుత్వ భవనాలకు పసుపు రంగు పడుతోంది. పంచాయతీ, ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులకు పచ్చరంగు వేయాల్సిందేనని ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. తాజాగా ఉపాధి కార్డులు పసుపు రంగులోనే ఉండాలని పాలకులు నిర్ణయించారు. లోటు బడ్జెట్‌ అంటూ సంక్షేమ పథకాలకు కత్తెర వేస్తూ.. ఏమాత్రం ఉపయోగం లేని అంశాలపై ప్రజాధనాన్ని వెచ్చిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

చిత్తూరు, సాక్షి: రాష్ట్ర ప్రభుత్వానికి రంగు పైత్యం పట్టుకుంది. తమ పార్టీ అధికార రంగు పసుపును ప్రభుత్వ భవనాలకు వేయాల్సిందేనని హుకుం జారీ చేసింది. దీంతో జిల్లాలోని పంచాయతీ భవనాలు, ఓహెచ్‌ఎస్‌ఆర్‌ (ఓవర్‌హెడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్‌) ట్యాంకులు, ఉపాధి కార్డులపై పచ్చరంగు పడుతోంది. దీనిపై ఎన్ని విమర్శలు వస్తున్నా ప్రభుత్వం లెక్క చేయడం లేదు. పైకి విమర్శలు చేయకపోయినా ఉద్యోగులు కూడా ఈ విషయంపై చర్చించుకుంటున్నారు. మెమో నంబర్‌ 2754/2017 సీపీఆర్‌అండ్‌బీ ఆర్‌డీ పేరిట పంచాయతీరాజ్‌ కమిషనర్‌ అన్ని జిల్లాల కలెక్టర్‌లకు, డీపీఓలకు పచ్చరంగు పులమడంపై ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భవనాలకు ఏ రంగు వేయాలి, ఏ కంపెనీ రంగు వాడాలో ఓ నమూనా చిత్రాన్ని పంపారు.

పంచాయతీ భవనాలకు..
జిల్లాలో 1,363 పంచాయతీలు ఉన్నా యి. వీటిలో 1,148 పంచాయతీలకు భవనాలు న్నాయి. వీటన్నింటిపై పసుపు రంగు పడనుంది. రాజ్యాంగం ప్రకారం పంచాయతీలు స్వపరిపాలన సంస్థలు. వీటికి.. రాజకీయ పార్టీలకు ఎలాంటి సబంధం లేదనే విషయం తెల్సిందే. అయినా పంచాయతీ భవనా లన్నింటికీ తెలుగుదేశం పార్టీ అధికారిక రంగును వేయిం చేందుకు ప్రభుత్వం పూనుకుంది. భవనం మొత్తం పసుపు రంగు, కార్నర్‌లకు తెలుపు రంగు వేయాలని మెమోలో ప్రభుత్వం సూచించింది.

9600 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులకు కూడా..
జిల్లాలో 9600 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులున్నాయి. వీటికి కూడా పచ్చరంగు వే యాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ట్యాంకుపైకి ఎక్కడానికి కేటా యించిన వంతెనకు తప్ప మొత్తం ట్యాంకుకు పసుపు రంగు వేయాలని పేర్కొం ది. 6734/2017 సీపీఆర్‌ ఆర్‌అండ్‌డీ పేరుతో ఆదేశాలు జారీ చేసింది.

ఉపాధి కార్డులకూ..
ఇప్పుడు ఉండే ఉపాధికార్డులను రద్దు చేసి పసుపు రంగు కార్డులిచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. పసుపు జాబ్‌ కార్డులు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పంపిణీ కూడా చేశారు. మన జిల్లాలో 6,58,914 జాబ్‌ కార్డులున్నాయి. వీటన్నింటినీ పసుపురంగులో ముద్రించి కొత్తగా పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. కేంద్రం నిధులతో నడిచే ఈ పథకంపై తన ముద్ర వేసుకోడానికే ఈ ప్రయత్నమని పలువురు పేర్కొంటున్నారు.  ప్రభుత్వ ఆడంబరాలకు ప్రజాధనం దుర్విని యోగం అవుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

మరిన్ని వార్తలు