ఎన్నికలు నిర్వహిస్తే బాబుకు ‘ఢిల్లీ ’ పరిస్థితే

13 Feb, 2015 00:46 IST|Sakshi
ఎన్నికలు నిర్వహిస్తే బాబుకు ‘ఢిల్లీ ’ పరిస్థితే

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్
 
 నర్సీపట్నం: రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితే సీఎం చంద్రబాబుకు పడుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. గురువారం నర్సీపట్నం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల్లో ఏడు స్థానాలు దక్కించుకున్న బీజేపీ, ఎనిమిది నెలలు తిరగకుండా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలకు సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. మోసపూరితమైన వాగ్దానాలతో అధికారంలోకి టీడీపీ అంతకన్నా దారుణమైన పరిస్థితి తప్పదన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టాయని పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్టుగానే స్టీల్‌ప్లాంట్ ఎన్నికల్లో అదే జరుతుందన్నారు. స్టీల్‌ప్లాంట్ ఎన్నికల్లో వైఎస్సార్‌టీయూసీ ఎదుర్కొనే శక్తిలేక టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఐఎన్‌టీయూసీ, టీఎన్‌టీయూసీ పోటీచేస్తున్నాయని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.


బాధిత కుటుంబానికి ఆర్థికసాయం: నర్సీపట్నం పీనారపాలెం రెండో వార్డుకు చెందిన రుత్తల నూకరాజు తుపాను సమయంలో చెట్టు పడి మృతి చెందాడు.  వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి సమకూర్చిన రూ.50 వేల చెక్కును గురువారం మృతుని భార్య లక్ష్మికి అమర్‌నాథ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో  నర్సీపట్నం నియోజకవర్గ కోఆర్డినేటర్ పెట్ల ఉమాశంకర్, మున్సిపాల్ పార్టీ అధ్యక్షులు కోనేటి రామకృష్ణ, కౌన్సిలర్లు తమరాన నాయుడు, బోడపాటి సుబ్బలక్ష్మి, బైపురెడ్డి వెంకటలక్ష్మి, కోనేటి వెంకటలక్ష్మి, మాజీ మహిళా విభాగం నాయకురాలు పీలా వెంకటలక్ష్మి, గుడబండి నాగేశ్వరరావు, గుడివాడ లక్షబాబు, ధనిమిరెడ్డి నాగు, ఎండీ భాషా, బైపురెడ్డి చినబాబు,చిట్టిరాజు , ఆరుగుల్ల రాజుబాబు, కర్రి శ్రీనివాసరావు, యాదగిరి శేషు, ఆదినారాయణ,ఏకా రాజుబాబు, ఆదేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు