మెనూ.. వెరీ టేస్టీ!

19 Sep, 2019 11:13 IST|Sakshi

బడి పిల్లలకు నాణ్యమైన భోజనం

మధ్యాహ్న భోజన పథకం మెస్‌ చార్జీల పెంపు

ఏప్రిల్‌ నుంచి వర్తింపు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు రుచికరమైన, నాణ్యమైన భోజనం వడ్డించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిమిత్తం ఒక్కో విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు రోజుకు అయ్యే వ్యయంలో 3.09 శాతం పెంచారు. ఈ పెంపు మొత్తం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి వర్తిస్తుందని మార్గదర్శకాల్లో పేర్కొంది.

సాక్షి, నెల్లూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నాయి. ఈ పథకానికి కేంద్రం 60, రాష్ట్రం 40 శాతం నిధులు భరిస్తున్నాయి. ఇక 9, 10 తరగతులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. గతేడాది వరకు ప్రాథమిక తరగతుల ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.4.35 విడుదల చేయగా, తాజా ఉత్తర్వుల ప్రకారం రూ.4.48 చెల్లిస్తారు. ప్రాథమికోన్నత తరగతుల విద్యార్థికి రూ.6.51 నుంచి రూ.6.71 వరకు పెంచారు. 9,10 తరగతుల విద్యార్థులకు రూ.6.51 నుంచి రూ.6.71 పెంచుతున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది.

జిల్లాలో మొత్తం ప్రభుత్వ బడులు 3,419
భోజనం పథకం అమలవుతున్న పాఠశాలలు 3,407
మొత్తం వంట ఏజెన్సీలు 3,003
అక్షయపాత్ర అమలవుతున్న స్కూళ్లు 291
మొత్తం విద్యార్థులు 2,31,260
ఇస్కాన్‌ సేవలున్న పాఠశాలలు 111

 నాణ్యమైన భోజనం కోసం..
బడి పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మెస్‌ చార్జీలు పెంచింది. మార్కెట్‌లో పెరిగిన నిత్యావసర సరుకులు, ఆకు కూరలు, కూరగాయలు నేపథ్యంలో పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని నిర్వాహకులు వడ్డించలేకపోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం బడి పిల్లల భోజనంలో రాజీ పడకూడదని రాష్ట్ర వాటాను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిర్వాహకులు పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించే అవకాశం ఉంది.

తరగతి          గతేడాది (2008–19 )వరకు

కేంద్రం రాష్ట్రం ఒక్కో విద్యార్థికి
ప్రాథమిక రూ.2.61 రూ.1.74 రూ.4.35
ప్రాథమికోన్నత రూ.3.91 రూ.2.60 రూ.6.51
9, 10 తరగతులకు రూ.6.51 రూ.6.51  –––

మెస్‌చార్జీల పెంపుదల తర్వాత

కేంద్రం రాష్ట్రం ఒక్కో విద్యార్థికి
ప్రాథమిక రూ.2.69 రూ.1.79 రూ.4.48
ప్రాథమికోన్నత రూ.4.03 రూ.2.68 రూ.6.71
9, 10 తరగతులకు రూ. 6.71 రూ.6.71 –––

బడి తోటల పెంపకం చేస్తే 
ప్రభుత్వ పాఠశాలల్లో బడి తోటల పెంపకం చేస్తే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించ వచ్చిందని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. బడి తోటల్లో పెంచే కూరగాయలు, ఆకు కూరల వల్ల  నిర్వాహకులకు కొంత వరకు ఖర్చు తగ్గుతుందనేది మరో కారణం. దీనికి తోడు విద్యార్థులకు పెరటి సాగుపై అవగాహన కల్పించే వీలు ఉంటుందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు