ఏపీ ఒలింపిక్‌ నూతన కార్యవర్గ ఏర్పాటు

2 Jun, 2019 15:56 IST|Sakshi

ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఏర్పాటు

చైర్మన్‌గా విజయసాయిరెడ్డి, అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్‌

సాక్షి, విజయవాడ : ఆంద్రప్రదేశ్‌ ఒలింపిక్‌ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఆదివారం ఏర్పాటైంది. చైర్మన్‌గా ఎంపీ విజయసాయిరెడ్డి, అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, ప్రదాన కార్యదర్శిగా  పురుషోత్తం ఎన్నికయ్యారు. వారితో పాటు 8 కమిటీలను, పలు అనుబంధ కమిటిలను ఏర్పాటు చేస్తున్నట్టు అసోషియేషన్‌ ఎన్నిక కమిటీ ప్రకటించింది. ఏపీఓఏ అధ్యక్షుడిగా నియమితుడైన ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యేగా కంటే క్రీడాకారుడుగా చెప్పుకోవడమే నాకు ఇ​ష్టం. నిజాయితీగా పనిచేసే వైఎస్‌ జగన్ ప్రభుత్వం వచ్చింది. క్రీడల అభివృద్ధికి పని పాటుపడాల్సి ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు క్రీడాభివృద్దికి కృషి చేస్తాను. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి, చైర్మన్ విజయసాయిరెడ్డి క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. క్రీడాభివృద్ధిలో భాగంగా మిగతా గొడవలు పట్టించు కోవద్దు. సీఎం జగన్ నాయకత్వంలో కలిసికట్టుగా పనిచేస్తాం’ అన్నారు. 

‘హైదరాబాద్‌లో ఉన్న ఒలింపిక్ భవన్ కబ్జాలో ఉంది. ఆ సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేస్తాం. చైర్మన్‌ విజయసాయిరెడ్డి త్వరలో గుంటూరులో ఏపీ ఒలింపిక్ భవన్ నిర్మాణం చేపడతామని హమీ ఇచ్చారు. సరిపడా కోచ్‌లను కూడా నియమిస్తాం. క్రీడా సంస్కృతిని పెంపొందించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో క్రీడలపరంగా ఏపీని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతాం’అని ప్రదాన కార్యదర్శిగా పురుషోత్తం అన్నారు.

మరిన్ని వార్తలు