‘టూరిజంకు బ్రాండ్‌ అంబాసిడర్‌ను నియమించనున్నాం’

18 Jun, 2019 21:56 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ టూరిజానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ను నియమించనున్నట్లు రాష్ట్ర టూరిజం, క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఐకానిక్ స్టేడియం లాంటి నిర్మాణాలను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో చేపట్టాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకో స్టేడియాన్ని నిర్మించాలని ఎమ్మెల్యేలు కోరినట్టు పేర్కొన్నారు. ఎన్‌సీసీని తెలంగాణ నుంచి విభజించాలని చూస్తున్నామన్నారు. ప్రతి ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎన్‌సీసీ కెడెట్స్‌తో చేపడతామని వెల్లడించారు. 

పలు ప్రాంతాలను లీజుకు తీసుకున్న కొన్ని సంస్థలు లీజు డబ్బులను సక్రమంగా చెల్లించడం లేదని తెలిపారు. అటువంటి సంస్థలకు లీజు డబ్బులు చెల్లించడం కోసం మూడు నెలల సమయం ఇస్తున్నట్లు వెల్లడించారు. డబ్బులు చెల్లించలేని పక్షంలో లీజులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కల్చరల్‌ విభాగంలో పని చేస్తున్న సిబ్బంది పని తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు