-‘డాన్’లకు బెయిలు !

24 Aug, 2014 03:51 IST|Sakshi
-‘డాన్’లకు బెయిలు !
  • అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లకు త్వరలో బెయిలు వచ్చే అవకాశం
  •  రంగంలోకి దిగిన దొంగల తరఫు న్యాయవాదులు
  •  అందరిపై 379 నమోదు, కొందరిపైనే 307
  •  సెక్షన్ 379 నమోదైతే నెలరోజుల్లో బెయిల్ మంజూరు...అదే దారిలో ప్రయత్నాలు
  •  పీడీ యాక్టుకు కలెక్టర్ విముఖత.. కొత్త కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని దాటవేత !
  •  నీరుగారిపోనున్న పోలీసుల శ్రమ
  • అంతా అనుకున్నట్లే జరుగుతోంది. ఎర్రచందనం ‘డాన్’లకు త్వరలో బెయిల్ రానుంది. వారిపై నమోదైన సెక్షన్లు, దొంగల తరఫు న్యాయవాదులు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే బెయిల్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ తెలంగాణ కేడర్‌కు బదిలీ కావడంతో ఇక పీడీ యాక్టు ఫైలును పూర్తిగా పక్కకు పడేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్ సింగపూర్ టూర్ ముగించుకుని వచ్చేలోపు జైలు పక్షులన్నీ బెయిల్‌పై స్వస్థలాలకు ఎగిరిపోయే ప్రమాదముంది.
     
    సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం మోస్ట్‌వాంటెడ్ అంతర్జాతీయ స్మగ్లర్లలో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి అరెస్టుకోసం రోజుల తరబడి ఇతర రాష్ట్రాలకు వెళ్లి, ఎంతో కష్టపడి అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేశారు. వీరిపై పీడీ యాక్టు నమోదైతే కనీసం ఏడాది వరకూ బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. అయితే అంతర్జాతీయ స్మగ్లర్లపై నమోదైన సెక్షన్లు, తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ‘ఇంటర్నేషనల్ డాన్లు’ బెయిల్‌పై బయటకు వచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
     
    నెలరోజులు పైబడి రిమాండ్‌లో..

    మోస్ట్‌వాంటెడ్ ఇంటర్నేషనల్ దొంగలైన ఆయిల్ రమేశ్, రియాజ్, హమీద్, లక్ష్మణ్‌నాయక్, లక్ష్మణన్, శరవణన్, రఫీ, విక్రమ్, అసీఫ్ అలీతో పాటు శామ్యూల్, నాగరాజు, సింగార్‌వేలును గత నెల 16కు ముందు పోలీసులు అరెస్టు చేశారు. వీరందరిపై సెక్షన్ 379 నమోదు చేశారు. దొంగతనం చేసిన వారిపై 379 నమోదు చేస్తారు. ఈ సెక్షన్ కింద అరెస్టయిన వారికి నెలరోజుల్లో బెయిల్ వస్తుంది. అలాగే కొంతమందిపై 379తో పాటు సెక్షన్ 307(హత్యాయత్నం)కూడా నమోదు చేశారు. 307 కింద కేసు నమోదైతే 45 రోజుల నుంచి 3 నెలల లోపు బెయిల్ వస్తుం ది.

    ప్రస్తుతం వీరిలో ఇద్దరు, ముగ్గురు మినహా అంద రూ 45 రోజుల పైబడి రిమాండ్‌లో ఉన్నారు. ఈ క్ర మంలో బెయిల్ అనివార్యమయ్యే పరిస్థితి. పీడీయాక్టు నమోదు చేసి ఉంటే కచ్చితంగా ఏడాదిపాటు బెయిల్ రాకుండా జైలు శిక్ష అనుభవించేవారు. అయితే జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ పీడీ యాక్టు నమోదులో నిర్లిప్తత ప్రదర్శించారు. గత కలెక్టర్ రాంగోపాల్ 2,3రోజుల్లో పీడీ యాక్టు ఫైలుపై సంతకం చేసి దొంగలను జైలుకు పంపారు. సిద్ధార్థ్‌జైన్ మాత్రం నెలరోజుల కిందట ఆయన వద్దకు ఫైలు వెళ్లినా ఇప్పటి వరకూ ‘పీడీ’ నమోదుకు ఉపక్రమించలేదు.

    పక్కా ప్రణాళిక ప్రకారం వీరిపై ‘పీడీ’ నమోదులో జాప్యం జరిగిందని అధికారవర్గాల ద్వారా తెలుస్తోం ది. వీరిపై పీడీ నమోదు చేయలేదని ‘సాక్షి’లో పలు కథనాలు వెలువడ్డాయి. అయినా అధికారులు స్పం దించలేదు. ఈ క్రమంలో సిద్ధార్థ్ జైన్ తెలంగాణ కేడర్‌కు బదిలీ అయ్యారు. ఇక ‘పీడీయాక్టుఫైలు’ను పూర్తిగా పక్కకు నెట్టేసినట్లు తెలుస్తోంది. సింగపూర్ పర్యటనకు వెళ్లడం, వచ్చేనెల 5 తర్వాత ఐఏఎస్‌ల బదిలీలు ఉండటంతో తెలంగాణకు వెళ్లే తాను దొంగలపై ‘పీడీ’కిలి బిగించడం దేనికనే ఆలోచనలో ఉన్న ట్లు తెలుస్తోంది. కలెక్టర్ సింగపూర్ నుంచే వచ్చేలోపు దొంగలంతా జిల్లా దాటి వారి స్వ ప్రాంతాలకు వెళ్లనుండటం ఖాయంగా కన్పిస్తోంది.
     
    జైళ్ల వద్దకు దొంగల న్యాయవాదులు
     
    రిమాండ్‌లో ఉన్న అంతర్జాతీయ దొంగల్లో ఆయిల్ రమేశ్ పీలేరు సబ్‌జైల్లో ఉన్నారు. రియాజ్, హమీద్, లక్ష్మణ్‌నాయక్, అసీఫ్ అలీ మదనపల్లె సబ్‌జైల్లో, లక్ష్మణన్, శరవణన్, రఫీ, విక్రమ్ మెహందీ సత్యవేడు సబ్‌జైల్లో, శామ్యూల్, నాగరాజు, సింగార్‌వేలు చిత్తూరు సబ్‌జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. ఈ జైళ్లలో ని దొంగలను వారి బంధువులు, అనుచరులతో పా టు వారి తరఫు న్యాయవాదులు కూడా అక్కడికి వెళ్లి కలిసినట్లు తెలుస్తోంది.

    బెయిల్‌కు ఏర్పాట్లు చేస్తున్న ట్లు పోలీసువర్గాల ద్వారా తెలిసింది. వీలైనంత త్వరలో బెయిల్ మంజూరవుతుందని, అందరూ బెయిల్‌పై బయటకు రావడం ఖాయమని ‘ఆపరేష న్ రెడ్’లో పాల్గొన్న ఓ సీనియర్ పోలీసు అధికారి ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. తాము దొంగలను అరె స్టు చేసేందుకు ఎంత కష్టపడ్డామో ‘దేవుడి’కి తెలుసని, అంత కష్టపడి నెలకు 15-20కోట్ల రూపాయలు సంపాదించే దొంగలను అరెస్టు చేస్తే వారిపై ‘పీడీ’కిలి బిగించకుండా స్వేచ్ఛగా బయటకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
     

>
మరిన్ని వార్తలు