మిత్రభేదం

4 Feb, 2018 12:57 IST|Sakshi

టీడీపీపై కమలనాథుల్లో పెరుగుతున్న అసంతృప్తి

మిత్రులను దరిచేరనీయని అధికార పార్టీ నేతలు

కాంట్రాక్ట్‌ పనులు, పథకాలకు దూరం

కనీస ప్రొటోకాల్‌ పాటించని టీడీపీ

కార్యక్రమ ఆహ్వానాలు కొందరికే..

జన్మభూమి కమిటీల్లో దక్కని చోటు

ఆలయ పాలకమండళ్ల కోసం పోటాపోటీ

జిల్లాలో బీజేపీ, టీడీపీ మధ్య అంతరం

సాక్షి, తిరుపతి: టీడీపీ, బీజేపీ నేతల మధ్య దూరం పెరుగుతోంది. అవకాశమిస్తే ఇబ్బందికరమని టీడీపీనేతలు తమ మిత్రపక్ష నాయకులను దూరంగా ఉంచుతున్నారు. తమను నమ్ముకున్న వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా తెలుగు తమ్ముళ్లు అడ్డుపడుతున్నారని బీజేపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. కాంట్రాక్ట్‌ పనుల నుంచి ప్రభుత్వ పథకాల
వరకు అడుగడుగునా బీజేపీ నేతలకు అవమానాలు, అన్యాయం జరుగుతుండటంతో చేసేది లేక ఢిల్లీ అధినాయకత్వానికి లేఖలు ద్వారా గోడును వెళ్లబోసుకుం టున్నారు. సాధారణ ఎన్నికలకు ముం దు అధికారం కోసం బీజేపీ, టీడీపీ పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే.

 తర్వాత కేంద్రంలో బీజేపీ... ఇటు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నా జిల్లా నేతల మధ్య సఖ్యత లేదు. పైకి మిత్రులమని చెప్పుకోవటానికి తప్ప ‘పొత్తు’ ఏ రకంగా తమకు ఉపయోగపడలేదని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లా కావటంతో తమ ప్రాభవాన్ని చాటులేకపోతున్నామనే భావన కమలనాథుల్లో ఉంది. పార్టీ అధ్యక్షులుగా, కేంద్ర మంత్రివర్గం లో కీలక పాత్ర పోషించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉన్నా జిల్లాలో ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేకపోయామనే దిగులు వారిని వేధిస్తోంది.

అడుగడుగునా అవమానాలే..
బీజేపీ నేతలు జిల్లాలో ఇటీవల అడుగడుగునా అవమానాలు ఎదుర్కొం టున్నారు. కుప్పం నియోజకవర్గంలో తాము బలంగా ఉన్నా ఏ రోజూ ప్రభు త్వ కార్యక్రమాలకు ఆహ్వానించిన దాఖ లాలు లేవని కమలనాథులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జన్మభూమి కమిటీల్లో ప్రాధాన్యత కల్పించమని అడిగినా పట్టించుకోలేదంటున్నారు. కుప్పంలోనే కాదు... జిల్లా వ్యాప్తంగా జన్మభూమి కమిటీల్లో బీజేపీ శ్రేణులకు ఏ ఒక్కరికీ చోటు కల్పించలేదనే విమర్శలు ఉన్నా యి. కుప్పం పరిధిలో ఓ గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డు కాంట్రాక్ట్‌ పని బీజేపీ నేత కావాలని ప్రాధేయపడినా... టీడీపీ నేతలు తిరస్కరించినట్లు సమాచారం.

 రైతు రథం పేరుతో జిల్లా వ్యాప్తం గా పెద్ద ఎత్తున ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఈ పథకంలో ఒక్క బీజేపీ కార్యకర్తకు ట్రాక్టర్‌ ఇచ్చిన దాఖలాలు లేవని బీజేపీ నాయకులంటున్నారు. వారు ప్రతిపాదించిన పేర్లలో ఏ ఒక్కరికీ ఇచ్చిన దాఖ లాల్లేవు. కాంట్రాక్టు పనుల కోసం దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ‘మీకు ఇస్తే మా పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటి’ అని ఎదురు తిరిగినట్లు సమాచారం.

పాలకమండళ్లు... మార్కెట్‌ కమిటీల్లోనూ అన్యాయం..
తుడా పాలకమండలిలో సుబ్రమణ్యం యాదవ్‌కు స్థానం కల్పించమని బీజేపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. టీడీపీ నేతలకు మాత్రమే స్థానం కల్పిం చారు. బోయకొండ దేవస్థానం చైర్మన్‌ కోసం ప్రయత్నించినా భంగపాటు ఎదురవుతోంది. శ్రీకాళహస్తి ఆలయ పాలకమండలిలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలకు స్థానం కల్పించాలని కోలా ఆనంద్‌ ప్రయత్నించారు. నిరాశే ఎదురైంది.  మార్కెట్‌ కమిటీల కోసం బీజేపీ నేతలు అనేకమంది ప్రయత్నాలు చేశారు. ఏ ఒక్కరికీ అవకాశం కల్పించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీటీడీ పాలకమండలిలో బీజేపీ నేతలకు ప్రాధాన్యత కల్పించాలని పట్టుబడుతున్నారు.

 టీటీడీ చైర్మన్‌ పదవి ఈసారి బీజేపీ వారికి కేటాయించాలని అధిష్టానం దృష్టి కి తీసుకెళ్లినట్లు సమాచారం. వైద్య, దేవా దాయ శాఖలో కమిటీ సభ్యులుగా నియమించడానికి కూడా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని తిరుపతికి చెందిన బీజేపీ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రెండు శాఖలకు సంబంధించి మంత్రులు బీజేపీ వారే ఉన్నా టీడీపీ నేతల పెత్తనమే ఎక్కువగా ఉందని ఆరోపించారు. బడ్జెట్‌ తర్వాత ఈ రెండు పార్టీల నేతలు వాగ్బాణాలు విసురుకుంటున్నారు.

మరిన్ని వార్తలు