‘అడగకుండానే సీఎం జగన్‌ అన్ని ఇస్తున్నారు’

22 Dec, 2019 19:01 IST|Sakshi

సాక్షి, విజయవాడ: అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని అమరావతి జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ... జీఎన్‌ రావు కమిటీ నివేదికను ఆహ్వానిస్తున్నామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ వలన అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, రాజధాని మార్చినా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. ఉద్యోగులకు కావల్సిన అన్ని సౌకర్యాలు ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తారనే నమ్మకం ఉందని బొప్పరాజు వెంకటేశ‍్వర్లు పేర్కొన్నారు. అమరావతి ఏర్పాటులో చంద్రబాబు అందరి అభిప్రాయం తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన వ్యాఖ‍్యానించారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భవిష్యత్‌ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారని బొప్పరాజు అన్నారు. తాత్కాలిక కార్యాలయాల్లో కనీస మౌలిక వసతులను చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రాజధాని ఏర్పాటు అనేది మన ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్మించుకోవాలని, లక్ష కోట్లు పెట్టి రాజధానిని నిర్మించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులకు ఏం కావాలో అడగకుండానే అన్నీ ముఖ్యమంత్రి ఇస్తున్నారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి చరిత్ర సృష్టించారని, అడగకుండానే కార్మికుల జీతాలు పెంచారన్నారు.

మరిన్ని వార్తలు