చంద్రబాబుతోనే రుణాలు కట్టించుకోండి

21 Dec, 2014 21:41 IST|Sakshi
చంద్రబాబుతోనే రుణాలు కట్టించుకోండి

బుక్కపట్నం: ‘ఎన్నికల ముందు బ్యాంకుల్లో ఎంత మొత్తం అప్పులున్నా, ఏ ఒక్క మహిళా రుణాలను చెల్లించవద్దని, అధికారంలోకి వస్తే అన్నీ మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.. ఆ మాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపించాం.. అందుకే ఆయన వద్దే రుణాలు కట్టించుకోండి.. మేము మాత్రం పైసా కూడా చెల్లించం..’ అంటూ అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం జానకంపల్లికి చెందిన డ్వాక్రా మహిళలు బ్యాంకర్లకు తేల్చిచెప్పారు.

బుక్కపట్నం ఎస్‌బీఐలో మహిళలు తీసుకున్న అప్పుల వసూలుకు స్థానిక పాఠశాలలో శనివారం బ్యాంకు మేనేజర్ నారాయణమూర్తి సమావేశం నిర్వహించారు. గ్రామంలోని 30 మహిళా సంఘాలకు రూ.1.50 కోట్ల రుణాలిచ్చినట్లు ఆయన చెప్పారు. బకాయిలు సక్రమంగా చెల్లించకపోవటంతో వడ్డీ పెరుగుతోందని, తరువాత అది భారమవుతుందని పేర్కొన్నారు. అప్పులను వెంటనే తీర్చాలని సూచించారు. దీంతో ఆగ్రహించిన మహిళలు తాము రుణాలు కట్టేదిలేదని స్పష్టం చేశారు.

చంద్రబాబు ప్రకటించిన గ్రూపునకు లక్ష రూపాయలు బ్యాంకులో తమ ఖాతాలకు జమ చేయాలని, అంతవరకు కట్టవలసిన మొత్తాలకు అదనపు వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించాలని, అప్పుడే బకాయిలను చెల్లిస్తామని చెప్పారు. గతంలో తమ ప్రమేయం లేకుండా తమ ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసుకున్నారని, ఆ సొమ్మును మొదట జమ చేయాలని డిమాండ్ చేశారు.
 

మరిన్ని వార్తలు