హైదరాబాద్: కర్నూల్ ఎస్పీ రఘురామిరెడ్డికి క్యాట్లో ఊరట లభించింది. కర్నూల్ నుంచి తనను బదిలీ చేయడం నిబంధనలకు విరుద్దమని ఆయన చేసిన వాదనలతో క్యాట్ ఏకీభవించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు రఘురామిరెడ్డిని కర్నూల్ ఎస్పీగానే కొనసాగంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని క్యాట్ అభిప్రాయపడింది. బదిలీపై ఏమైనా అభ్యంతరాలున్నాయని పిటిషనర్ భావిస్తే పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డును ఆశ్రయించవచ్చని ప్రభుత్వం చేసిన వాదనను క్యాట్ తోసిపుచ్చింది. స్టేను ఎత్తివేయాలంటూ గవర్నమెంట్ దాఖలు చేసిన వేకెట్ పిటిషన్ను క్యాట్ కొట్టివేసింది.
కర్నూలు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు నిబద్ధతతో పని చేస్తున్న రఘురామిరెడ్డిని స్వార్థ రాజకీయాలు బదిలీతో సన్మానించడం తెలిసిందే. అయితే కర్నూలులో బాధ్యతలు తీసుకొని మూడున్నర మాసాలు గడవక మునుపే నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారంటూ ఎస్పీ క్యాట్ను ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఆదేశించింది. ఆ మేరకు ఆయన సమర్థవంతమైన అధికారి అయినందునే హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా బదిలీ చేసినట్లు ప్రభుత్వం నివేదించింది. అందుకు క్యాట్ సంతృప్తి చెందకపోగా కర్నూలు జిల్లాకు సమర్థుడైన అధికారి అవసరం లేదా అని ప్రశ్నించింది.
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎస్పీ బదిలీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఫలితంగా ఈ విషయం అధికార పార్టీని కుదిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బదిలీలో ఇరువురు మంత్రుల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, తనను మాట మాత్రం కూడా సంప్రదించకుండా ఓ జిల్లా స్థాయి అధికారిని బదిలీ చేయడం పట్ల ఆయన గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ‘‘ఆయన బాగానే పని చేస్తున్నారు కదా.. ఎందుకు బదిలీ చేయాలి. మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో తాను ముఖ్యమంత్రితో మాట్లాడుతా’నంటూ సన్నిహితులతో కోట్ల అన్నట్లు తెలిసింది. ఎస్పీకి మద్దతుగా ప్రజలు, ప్రజాసంఘాలు అండగా నిలిచాయి.