ఇంజనీరింగ్‌ కాలేజీల్లో రోబోటిక్‌ సెంటర్‌లు

17 Oct, 2019 16:22 IST|Sakshi

సాక్షి, విజయవాడ : రొబొటిక్, మెకట్రానిక్స్‌ విభాగాల్లో ఇంజనీరింగ్‌ విద్యార్థులకు హైఎండ్‌ శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా ఎపీఎస్‌ఎస్‌డీసీ– జర్మనీకి చెందిన యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ మెకట్రానిక్స్‌తో ఒప్పందం చేసుకుని కలిసి పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌ చల్లా మధుసూదన్‌ రెడ్డి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా రొబోటిక్‌ విభాగంలో జర్మన్‌ సంస్థతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. గురువారం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ఎపీఎస్‌ఎస్‌డీసీ– యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ మెకట్రానిక్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండో విడత 20 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అడ్వాన్స్‌డ్‌ రోబోటిక్‌ కంట్రోల్‌ ల్యాబ్‌లను ఆన్‌లైన్‌ ద్వారా చైర్మన్‌ చల్లా ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ ఒప్పందం ప్రకారం మొదటి విడతలో భాగంగా ఇప్పటికే 11 ఇంగిరినీరింగ్‌ కాలేజీల్లో అడ్వాన్సుడ్‌ రోబోటిక్స్‌ లాబ్స్‌ ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో 788 మంది విద్యార్థులు ఏఆర్సీ 1.0 లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. రెండవ విడత 20 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అడ్వాన్స్‌డ్‌  రోబోటిక్‌ కంట్రోల్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి 800 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇండస్ట్రీ 4.0కు ఆనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఏపీలోని ఇంజనీరింగ్‌ విద్యార్థులకు రోబోటిక్స్‌ విభాగంలో నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్‌, ప్రాజెసింగ్‌ రంగంలో జర్మనీకి సంబంధించిన టెక్నాలజీని పరిశ్రమలకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండి, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ మాట్లాడుతూ రొబొటిక్స్, ఆటోమేషన్, మెకట్రానిక్స్ విభాగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన విధంగా శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిందన్నారు. కేవలం డిగ్రీతో ఉద్యోగం రాదని, దానితోపాటే అదనపు నైపుణ్యాలు ఉన్నపుడే ఉద్యోగాలు వస్తాయన్నారు. అందువల్లే టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యార్థులకు ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో మార్కెట్లో డిమాండ్ ఉన్న సర్టిఫికేషన్ కోర్సుల్లో శిక్షణ మస్తున్నామన్నారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికేషన్, ప్రశంసా పత్రాలను చైర్మన్‌ చల్లా అందజేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్‌ లీడర్‌ అండ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సెంటర్‌ ఫర్‌ మెకట్రానిక్స్‌(ఈసీఎం) ప్రెసిడెంట్‌ వీవీఎన్‌ రాజు, యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ మెకట్రానిక్స్‌ ఎండీ (జర్మనీ) టిల్‌ క్వార్డ్‌ ఫ్లిగ్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు