‘ఎలక్షన్ మిషన్–2019’పై టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్లో ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేస్తామని, రాజ్యాంగాన్ని రక్షించడమే బీజేపీయేతర 23 పార్టీల ఎజెండా అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ‘ఎలక్షన్ మిషన్–2019’పై ఆయన గురువారం రాష్ట్రంలోని టీడీపీ ప్రజాప్రతినిధులు, అసెంబ్లీ నియోజక వర్గాల ఇన్చార్జిలతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. బీజేపీ నిరంకుశ పాలన అంతమే తమ కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో పొత్తులేదని, అయినప్పటికీ కోల్కతా, కర్ణాటకలలో ఆ రెండు పార్టీలు ఒకే వేదికపైకి వచ్చాయని అన్నారు. ఈబీసీ కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తే వీళ్లకు బాధేంటన్నారు. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఐదేళ్లలోనే చేశామని, చెప్పనవి కూడా అనేకం చేశామని ఆయన చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం పట్ల ఇప్పటికే 78.5 శాతం సంతృప్తి ప్రజల్లో ఉందని, కొన్ని నియోజకవర్గాలలో 84 శాతం సంతృప్తి ఉందన్నారు.