అమ్మఒడి.. విద్యా విప్లవానికి నాంది

10 Jan, 2020 05:12 IST|Sakshi
చిత్తూరులో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, చిత్రంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రోజా, ఆరణి శ్రీనివాసులు

భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా చరిత్రాత్మక పథకం

పేదరికంతో నిమిత్తం లేకుండా ఉన్నత చదువులు

‘అమ్మఒడి’ ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌

మౌలిక వసతులతోపాటు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

అర్హులైన ప్రతి విద్యార్థి తల్లికి ఏటా రూ.15 వేలు

రూ.6,456 కోట్లు కేటాయింపు..

దాదాపుగా 43 లక్షల మంది తల్లులకు తద్వారా దాదాపుగా 82 లక్షల మంది పిల్లలకు లబ్ధి

అర్హులైనవారు ఇంకా ఉంటే ఫిబ్రవరి 9వ తేదీ లోపు నమోదు చేసుకోండి

వసతుల నిర్వహణలో అక్కచెల్లెమ్మలు భాగస్వాములు కావాలని పిల్లల మేనమామగా అభ్యర్థిస్తున్నా

సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో అమ్మఒడి పథకం ద్వారా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.  పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని చెప్పారు. 14 ఏళ్ల లోపు పిల్లలకు విద్య ప్రాథమిక హక్కు అని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21ఏ పేర్కొన్నప్పటికీ, పేదరికం కారణంగా చాలా మందికి పిల్లలను చదివించే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి పేదింటి తల్లులు, పిల్లలకు అండగా ఉండేందుకే  ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు.

చిత్తూరులో గురువారం ఆయన అమ్మఒడి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘ప్రతి బిడ్డ అమ్మ ఒడిలో ఎదుగుతుంది. ఆ తల్లి గుండెల్లో పెట్టుకుని బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. తల్లి తన కంటే ప్రాణంగా బిడ్డలను చూసుకుంటుంది. అలాంటి తల్లులను, అక్కచెల్లెమ్మలను నా 3,648 కిలోమీటర్లు ప్రజా సంకల్ప పాదయాత్రలో చూశాను. వారికి పిల్లల చదువులు భారం కాకుడదని భావించాను. అందుకే ఈ పథకాన్ని ఇక్కడ ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నా. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా ఈ పథకం కింద రూ.15 వేలు ఇస్తాం’ అని చెప్పారు. ఈ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
 
ఈ డబ్బును పాత అప్పులకు జమ చేసుకోరు
‘అమ్మఒడి పథకం ద్వారా చేకూరే లబ్ధి బ్యాంకర్లు మునపటి అప్పులకు జమ చేసుకోకూడదని సూచించాం. బ్యాంకర్లు సహకరించారు. ఈ పథకం కింద దాదాపు 42,12,186 లక్షల మంది తల్లులు, 81,72,224 లక్షల మంది పిల్లలకు మేలు చేకూరుతుంది. వీరికి రూ.6,456 కోట్లు చెల్లించనున్నాం. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు అమ్మఒడి ప్రవేశపెట్టనున్నట్లు పాదయాత్రలో చెప్పాను. ప్రస్తుతం ఇంటర్‌ వరకు వర్తింప చేస్తున్నాం. వరుసగా ప్రతి ఏటా తల్లుల అకౌంట్‌లో రూ.15 వేలు జమ అవుతుంది. చదువుకోవాలంటే ముందు కడుపు నిండాలని, తల్లులకు ఆర్థికంగా భరోసా ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ పథకంలో విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. ఈ ఏడాది మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నాం. వచ్చే సంవత్సరం నుంచి తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉంటేనే పథకం వర్తిస్తుంది.

ఆంగ్ల మాధ్యమంపై ప్రజల ఆకాంక్ష..
చంద్రబాబుకు, పత్రికాధిపతికి, సినిమా యాక్టర్‌కు పట్టడం లేదు. తెలుగు మీడియం కావాలనే నేతలెవరూ, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు వారి పిల్లలను ఆ మీడియంలో చదివించడం లేదు. ఇంగ్లిష్‌ మీడియం కావాలా.. వద్దా.. అని మిమ్మల్నే అడుగుతున్నా.. మీరిచ్చే సమాధానమే వారికి జవాబు. (కావాలి.. కావాలి.. అంటూ జనం నినాదాలు)

ఇంగ్లిష్‌ మీడియంలో బోధన
పేద విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించేలా ఇంగ్లిష్‌ మీడియంలో బోధన. తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు.

మనబడి నాడు–నేడు
రూ. 14 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో 9 రకాల మౌలిక సదుపాయాల కల్పన.

జగనన్న విద్యా దీవెన
పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఎంతైనా సరే పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌.

మధ్యాహ్న భోజన పథకం
నాణ్యత పెంచి, పౌష్టికాహారం అందించేలా మెనూలో మార్పులు. రూ.353 కోట్లు అదనంగా కేటాయింపు.

జగనన్న వసతి దీవెన
వసతి, భోజన ఖర్చులకు కోసం ఏటా రూ.20 వేలు.. రెండు దఫాలుగా చెల్లింపు

నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించాలి. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఉపాధ్యాయులకు సరైన తర్ఫీదు ఉండాలి. నాణ్యమైన విద్యను అందించినప్పుడే పేద పిల్లలు లక్ష్యం చేరుకుంటారు. అందుకే పోటీ ప్రపంచంలో దీటుగా నిలిచేందుకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టబోతున్నాం. రాబోయే జూన్‌లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరి చేశాం. తెలుగు మీడియం పిల్లలకు కొంత ఇబ్బంది వస్తుంది. దీన్ని అధిగమించేందుకు బ్రిడ్జి కోర్సులు, ఉపాధ్యాయులకు ట్రైనింగ్‌ కోర్సులు ప్రవేశ పెట్టాం. ఆ తర్వాతి సంవత్సరం నుంచి ఒక్కో తరగతి పెంచుకుంటూ వెళతాం. ఇలా నాలుగేళ్లలో మన పిల్లలు బోర్డు ఎగ్జామ్‌ను ఇంగ్లిష్‌లో రాసే పరిస్థితి వస్తుంది. కొందరు ఇంగ్లిష్‌ మీడియం వద్దంటున్నారు.   ఈనాడు పేపర్‌కు, చంద్రబాబునాయుడుకు, సినిమా యాక్టర్‌కు విన్పించేలా మీ అభిప్రాయం గట్టిగా చెప్పండి. (కావాలంటూ ప్రజలు నినాదాలు చేశారు) 2020 జూన్‌లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశ పెడుతున్నాం. అప్పుడు 6వ తరగతి చదివే పిల్లలకు 2030లో డిగ్రీ పూర్తి అవుతుంది. 2032లో పీజీ చేస్తారు. 2020లో పుట్టిన పిల్లలు 2040లో డిగ్రీ పూర్తి చేస్తారు. ఆ నాటికి మన పిల్లలు ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడతారు. ఆ మేరకు ప్రభుత్వ బడులను మార్చేస్తాం. సిలబస్‌లో మార్పు తెస్తాం. పేదరికంలో ఉన్న వారి బతుకులు మారాలి. కుల వృత్తితో అన్యాయమైన బతుకు కొనసాగకూడదు.

మరో కీలక నిర్ణయం.. మధ్యాహ్న భోజనంలో మార్పులు
విద్యార్థులకు మంచి చదువుతోపాటు పౌష్టికాహారం కూడా ముఖ్యమే. మంచి ఆహారం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అందుకే మధ్యాహ్న భోజనం మెనూలో మార్పు తేవాలని సంకల్పించాం. పిల్లల భోజనం మెనూ విషయంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ఆలోచించి ఉండరు. మెనూ మార్పు ద్వారా దాదాపు రూ.200 కోట్లు అదనపు భారం పడుతుంది. భోజనం వండి పెట్టే ఆయాల జీతాలు వెయ్యి రూపాయల నుంచి రూ.3 వేలకు పెంచడం వల్ల రూ.160 కోట్లు అదనంగా ఖర్చవుతుంది. అయినా పిల్లల కోసం ఆ ఖర్చును సంతోషంగా భరిస్తాం. సంక్రాంతి సెలవుల తర్వాత నుంచి కొత్త మెనూ అమలు చేస్తాం. ఆ మెనూ ఇలా ఉంటుంది.

సోమవారం : అన్నం, పప్పు చారు, ఎగ్‌ కర్రీ, స్వీట్‌ చిక్కీ
మంగళవారం : పులిహోర, టామాటా పప్పు, ఉడికించిన గుడ్డు
బుధవారం : వెజిటబుల్‌ రైస్, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్‌ చిక్కీ
గురువారం : కిచిడీ, టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు
శుక్రవారం : అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్‌ చిక్కీ
శనివారం : అన్నం, సాంబారు, స్వీట్‌ పొంగల్‌

తాము వండిన ఆహార పదార్థాలను సీఎంకు రుచి చూపిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు

నాడు – నేడుతో ప్రభుత్వ బడుల్లో సమూల మార్పు
రాష్ట్రంలో చదువుల విప్లవం కోసం 45 వేల పాఠశాలు, 471 జూనియర్‌ కళాశాలలు, 3,287 హాస్టళ్లు, 148 డిగ్రీ కళాశాలల్లో నాడు–నేడు ద్వారా మార్పు తెస్తాం. శిథిలావస్థలో ఉన్న బడులను చదువుల దేవాలయాలుగా మార్చాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తున్నాం. ఇప్పుడు బడుల ఫొటోలు తీశాం. వాటి రూపు రేఖలను పూర్తిగా మార్చేసిన తర్వాత మళ్లీ ఫొటోలు తీసి చూపిస్తాం. ఈ ప్రక్రియను మూడేళ్లలో పూర్తి చేస్తాం. మొదటి దశగా ఈ సంక్రాంతి తర్వాత 15,745 బడుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. టాయిలెట్లు, మంచినీళ్లు, ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లు, పర్నిచర్, గ్రీన్‌ బ్లాక్‌ బోర్డు, పెయింటింగ్, కాంపౌండ్లు, ఇతర మరమ్మతులు, ఇంగిస్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తాం. సగం విద్యా సంవత్సరం గడిచిన తర్వాత గానీ పుస్తకాలు అందని పరిస్థితిని ఏటా చూస్తున్నాం. ఈ పరిస్థితిని మారుస్తూ.. స్కూళ్లు తెరిచే నాటికే ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలందరీకి స్కూల్‌ కిట్‌ అందజేస్తాం. అందులో 3 జతలు యూనిఫాం, పుస్తకాలు, బూట్లు, సాక్సులు, బెల్ట్, స్కూల్‌ బ్యాగ్‌ అందజేస్తాం. భోదన ప్రమాణాలు పెంచడంతోపాటు, టీచర్లకు శిక్షణ, విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు ఏర్పాటు చేస్తున్నాం.

విద్యా దీవెనతో ఆదుకుంటాం
ఇంటర్మీడియట్‌ తర్వాత 23 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉన్నత చదువులకు వెళ్తున్నారు. మిగతా 77 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదరికంలో ఉన్న మైనార్టీలు, ఇతర వర్గాల్లోని పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువులు మానేస్తున్నారు. అలాంటి వారి కోసం విద్యా దీవెన పథకం ప్రవేశ పెట్టాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా తోడుగా ఉంటాం. ఎంతటి చదువులైన చదివేందుకు అవకాశం కల్పిస్తాం. పేదవారికి తోడు–నీడగా ఉండేందుకు వసతి దీవెన పథకం ద్వారా హాస్టల్‌ ఖర్చులు కూడా భరిస్తాం. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో రూ.10 వేలు.. జూలై, ఆగస్టులో మరో రూ.10 వేలు పేద విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్‌లో హాస్టల్‌ ఖర్చుల కోసం జమ చేస్తాం’ అని సీఎం అన్నారు.

పిల్లల మేనమామగా అభ్యర్థిస్తున్నా..
భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో అమ్మఒడి పథకాన్ని రూపొందించాం. స్కూళ్ల రూపు రేఖలు మారుస్తున్నాం. ఇంగ్లిష్‌  మీడియం తీసుకొస్తున్నాం. పేరెంట్స్‌ కమిటీలు ఏర్పాటు చేశాం. మీ స్కూల్‌ పనితీరులో మీ భాగస్వామ్యం కూడా కావాలి. మీ పిల్లలు వెళ్లే పాఠశాల వాచ్‌మన్‌ మీద, బాత్‌రూమ్‌ల మీద కాస్త ధ్యాస పెట్టండి. బాత్‌రూం నిర్వహణ, వాచ్‌మన్‌ జీతం కోసం మీరూ భాగస్వాములు కావాలి. అప్పుడే జవాబుదారితనం పెరుగుతుంది. అందుకోసం మీకు అందించే రూ.15 వేలల్లో రూ.వెయ్యి పాఠశాల నిర్వహణ కోసం పేరెంట్స్‌ కమిటీకి అప్పగించండి. పాఠశాల రూపురేఖలు మారినా, నిర్వహణ బాగోలేకపోతే పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. అందుకే పాఠశాలల నిర్వహణ బాధ్యత అక్కచెల్లెమ్మలు తీసుకోవాలి. ప్రతి తల్లికి అన్నాగా తోడుగా ఉంటూ.. పిల్లలకు మంచి మేనమామగా అభ్యర్థిస్తున్నా’ అని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. అనంతరం ల్యాప్‌టాప్‌ ద్వారా బటన్‌ నొక్కి అమ్మ ఒడి పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, బల్లి దుర్గాప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు.  

విప్లవాత్మక విద్యకు ఈ పథకాలతో రాచబాట
పథకం పేరు                           ఉద్దేశం                                           వ్యయం
జగనన్న అమ్మఒడి         పిల్లలందరినీ బడికి పంపాలి                         రూ.6,456 కోట్లు
మధ్యాహ్న భోజనం         పేద పిల్లలకు పౌష్టికాహారం                           అదనంగా రూ.360 కోట్లు
నాడు–నేడు                 స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన            రూ.14,000 కోట్లు
జగనన్న విద్యా దీవెన    అర్హతగల ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌    పూర్తి ఫీజు
జగనన్న వసతి దీవెన    హాస్టల్‌ ఖర్చులనూ ప్రభుత్వమే భరించడం          ఒక్కో విద్యార్థికి ఏటా రూ.20 వేలు

అందరి కష్టాలు చూశారు.. అండగా నిలిచారు
ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా నాడు ‘నేను విన్నాను.. నేను చూశాను.. నేను ఉన్నాను..’ అన్నారు. అందుకే ప్రజలంతా రావాలి జగన్‌.. కావాలి జగన్‌.. అంటున్నారు. ఇవాళ మా మేలు కోసం సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అమ్మఒడి పథకం ద్వారా మా అమ్మకు రూ.15 వేలు ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టి మా బతుకులు మార్చబోతున్నాయి.

నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నారు. ఇందుకు సీఎంకు కృతజ్ఞతలు. ఐఏఎస్‌ అధికారిణి కావడమే నా లక్ష్యం. ఆ దిశగా ఈ కార్యక్రమాలు, పథకాలు నాకెంతో మేలు చేస్తాయని భావిస్తున్నా. అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపుతున్న సీఎం జగన్‌కు మనసారా ధన్యవాదాలు. (ఇంగ్లిష్‌లో మాట్లాడింది)    
  
 –కల్పవృక్షిణి, పీసీఆర్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని, చిత్తూరు

అమ్మానాన్నలా, అన్నలా ఆదరిస్తున్నారు
మా అమ్మ సహాయ వంటమనిషిగా పనిచేస్తోంది. మా నాన్న నిరుద్యోగి. నా ఆశయం ఐఏఎస్‌ అధికారి కావడమే. ఈ పథకాన్ని వినియోగించుకుని నేను బాగా చదువుకుంటాను. స్మార్ట్‌ ఫోన్‌కు ఇచ్చిన ప్రాధాన్యం విద్యార్థుల కంటికి ఇవ్వలేదు. కానీ సీఎం.. వైఎస్సార్‌ కంటి వెలుగును ప్రారంభించి మా కళ్లకు పరీక్షలు చేయించారు. కళ్లద్దాలను కూడా ఉచితంగా అందజేశారు. రోజూ ఒకే రకమైన భోజనం తిని విసుగు వచ్చేది. ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకంలో పలు మార్పులు చేసి మాకు చక్కటి భోజనం పెట్టనున్నారు. అమ్మానాన్నలా, ఒక అన్నలా ఆలోచించి మాకు ఎంతో మేలు చేస్తున్నారు.
    
– నవ్యప్రజ్వలిక, ఆదర్శ పాఠశాల, శాంతిపురం, చిత్తూరు జిల్లా

పిల్లల భవిష్యత్‌ బాగుపడనుంది
సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్‌ జగన్‌.. అందరి కష్టాలు తీర్చేందుకు నవరత్నాలను ప్రకటించారు. వాటిలో కీలకమైంది అమ్మఒడి పథకం. ఈ పథకం మా వంటి పేదలకు ఎంతో మేలు చేస్తోంది. మేము మా పిల్లలను బడికి పంపే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు రూ.15 వేలు సహాయం చేస్తుండడం వల్ల పిల్లలను బడికి పంపించగలుగుతున్నాం. ఇంగ్లిష్‌ మీడియం మా పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది. నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. తద్వారా పిల్లల భవిష్యత్‌ బాగుపడుతుందనడంలో సందేహం లేదు.
  
 –శ్రీదేవి, విద్యార్థి తల్లి, పెడగంటిపల్లి గ్రామం, జీడీనెల్లూరు మండలం

పిల్లలు బాగా చదువుకునే వాతావరణం పాఠశాలల్లో ఉండాలి.. మంచి చదువులు చెప్పే ఉపాధ్యాయులు ఉండాలి.. చదువులు పేదింటి తల్లులకు భారం కాకూడదు.. పిల్లలకు కడుపు నింపే తిండి ఉండాలి.. ఈ నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ పథకం తీసుకొస్తున్నాం. పేదింటి పిల్లలు పోటీ ప్రపంచంలో దీటుగా నిలిచేలా తయారవ్వాలన్నదే మా లక్ష్యం.

అమ్మ ఒడి పథకం ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరుతుంది. అర్హత ఉండి లబ్ధి చేకూరని తల్లులు ఎలాంటి హైరానా పడాల్సిన పనిలేదు. ఫిబ్రవరి 9వ తేదీలోపు.. అంటే నెల రోజుల్లోపు పేర్లు నమోదు చేసుకోండి. అర్హులైన ప్రతి ఒక్కరికి అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తాం.
- ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

మరిన్ని వార్తలు