గవర్నర్‌ను కలిసిన సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు

18 Nov, 2019 15:01 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజ్‌భవన్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దంపతులకు గవర్నర్‌ కార్యదర్శి ముకేష్‌ కుమార్‌ మీనా, సంయుక్త కార్యదర్శి అర్జునరావు తదితరులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్‌తో భేటీ అయిన సీఎం వైఎస్‌ జగన్‌ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాల గురించి వివరించారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్టు గవర్నర్‌కు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై కొద్దిసేపు చర్చించారు. 

అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతుల గౌరవార్థం గవర్నర్‌ దంపతులు రాజ్‌భవన్‌లో ప్రత్యేకంగా విందు ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కూడా గవర్నర్‌ను సత్కరించి మెమెంటో అందజేశారు  సీఎం జగన్‌ వెంట ముఖ్యమంత్రి కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ తలశిల రఘురాం, సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు