రిలయన్స్ సంస్థ పాల్పడుతున్న పాపాలకు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్లు బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణ మంగళవారం విజయవాడలో అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అవసరాలు తీర్చిన తర్వాతే రిలయన్స్ గ్యాస్ను ఇతరులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలను అదుపులో పెట్టుకోలేని కిరణ్, రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తారని నారాయణ ఎద్దేవా చేశారు. శిక్షపడ్డవారు పోటీకి అనర్హులని ఇచ్చిన తీర్పును సుప్రీం పునః సమీక్షించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన వారిపై న్యాయవ్యవస్థ ఆధిపత్యం ఎక్కువైందన్నారు. ఇది సరైన విధానం కాదని నారాయణ పేర్కొన్నారు.