కళాకారులంటే అంత చులకనా?

7 Mar, 2019 17:47 IST|Sakshi
విజయవాడ దుర్గాపురంలోని సృజనాత్మక సమితి కార్యాలయం 

సాక్షి,విజయవాడ : ఏపీ సృజనాత్మక సమితి, రాష్ట్రంలోని పేద కళాకారుల సంక్షేమం కోసం, భాషా సాంస్కృతిక, సంప్రదాయాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేశారు. అయితే తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని రూపురేఖలే మారిపోయాయి. కళాకారుల పక్షాన నిలబడాల్సిన శాఖ ప్రభుత్వం ప్రచార సంస్థగా మారటం అత్యంత విచారకరం. తమకు రావాల్సిన బకాయిల కోసం కళాకారులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కనికరించడం లేదని కళాకారులు ఆవేదన చెందుతున్నారు.


3 కోట్లకు పైగా బకాయిలు 
రాష్ట్రంలో కళాకారులు ఏ సాంస్కృతిక కార్యక్రమం జరుపుకున్నా దాని ప్రాధాన్యతను బట్టి శాఖ వారికి కొంతమెత్తం చెల్లిస్తుంది. గత సంవత్సం ఆగస్టు నెల నుంచి నేటి దాకా కళాకారులకు 3 కోట్లకు పైగా చెల్లింపులు చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది.

 
చెల్లింపులు నిలిపివేత! 
రాష్ట్రంలో 13 జిల్లాల్లో  నాలుగు వేల మందికి పైగా కళాకారులన్నారు. ప్రతీ సందర్భంలో వారు  తమ ప్రదర్శనల ద్వారా జీవనోపాధిని పొందుతున్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారం అంటూ కళాకారులను వాడుకున్న ప్రభుత్వం కళాకారులకు చెల్లించాల్సిన చెల్లింపులను నిలిపివేసింది.


తెలుగు తమ్ముళ్లకు దొడ్డిదారి చెల్లింపులు 
ఇతర కళాకారుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం తెలుగు తమ్ముళ్లకు.. వారి ప్రదర్శనలకు వెం టనే చెల్లింపులు చేస్తోంది. మూడు సంవత్సరాలలో సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా అనుచరురాలుగా చెప్పుకుంటున్న సంస్థకు 30 పైగా కార్యక్రమాలకు భారీగా సహాయాన్ని అందించింది. ( నిబంధనల ప్రకారం ఒక సంత్సరంలో 6 నెలలకు ఒక కార్యక్రమం ఇవ్వవచ్చు) ఆ సంస్థకు అన్ని కార్యక్రమాలు ఎందుకు ఇచ్చారో ఎవరికీ అర్ధం కావడం లేదు.


సిబ్బందికి సైతం... 
భాషా సాంస్కృతిక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం నాలుగు నెలలుగా జీతాలు చెల్లిం చడం లేదు.  దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాలు ఎలా గడుపుకోవాలో వారికి అర్ధం కావడం లేదని వారంతా సాక్షికి మెరపెట్టుకున్నారు.  ఏదిఏమైనా ఎనిమిది నెలలుగా కళాకారులకు బకాయిపడ్డ 3 కోట్లను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కళాకారులంతా ముక్తంకంఠంతో కోరుతున్నారు.

మరిన్ని వార్తలు