మారణకాండలో.. మూడు దళాలు!

27 Sep, 2018 08:38 IST|Sakshi
లివిటిపుట్టులో ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న డీజీపీ ఠాకూర్‌

ఏవోబీ మిలటరీ కమిషన్‌ వ్యూహరచన

నందాపూర్‌ దళం కార్యాచరణ

పెదబయలు ఏరియా కమిటీ సహకారం

కిడారి, సివేరిల హత్య వ్యూహం అమలుకు 2 నెలల నుంచే శ్రీకారం

ముందుగానే పోలీసు ఇన్‌ఫార్మర్ల కట్టడి

సంచలనం సృష్టించాలనే లివిటిపుట్టులో యాక్షన్‌

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన కిడారి, సివేరిల హత్యాకాండ వెనుక ఏం జరిగందన్న విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మావోలు వారినే ఎందుకు టార్గెట్‌ చేశారు?.. ఎప్పటినుంచి పథక రచన చేశారు?.. వ్యూహం అమలులో ఎవరు సహకరించారు?.. తదితర అంశాలకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ హత్యాకాండలో స్థానిక మావోయిస్టు కమిటీల ప్రమేయం ఏమీ లేదని వార్తలు వచ్చినా.. అందులో వాస్తవం లేదని తేలుతోంది. అరకు ఏజెన్సీలో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న పెదబయలు కమిటీ కూడా మావోయిస్టు మిలటరీ కమిషన్‌కు సహకరించిందని తెలుస్తోంది.
మరోవైపు కేంద్ర ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలను రాష్ట్రం బేఖాతరు చేయడం వల్లే ఈ ఉపద్రవం సంభవించిందనీ.. చర్చల పేరుతోనే మావోయిస్టులు కిడారిని రప్పించి మరీ వేటు వేశారని విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తోంది.మారణకాండ నుంచి ఇంకా పూర్తిగా తేరుకోని లివిటిపుట్టు గ్రామంలోని పలువురిని విచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లడం.. ఆ గ్రామస్తులను వణికించింది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మట్టుబెట్టడం ద్వారా ఏవోబీలో తమ పట్టు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు మావోయిస్టులు రెండు నెలల క్రితం నుంచే ప్రత్యేక ఆపరేషన్‌కు  శ్రీకారం చుట్టారు. ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరిం చిన ఆంధ్ర ఒడిశా బోర్డర్‌ కమిటీ,  నందాపూర్‌ దళానికి పెదబయలు ఏరియా కమిటీలోని ముఖ్య నాయకులు పూర్తి సహకారం అందించినట్టు తెలుస్తోంది. నందా పూర్‌ దళానికి పెదబయలు దళ కమండర్‌ సుధీర్, అశోక్‌లతో పాటు ఆంధ్ర ఒడిశా సరిహద్దు కమిటీలో మంచి పట్టున్న కిరణ్‌ కూడా ఈ ఆపరేషన్‌లో కీలకంగా పాల్గొన్నట్టు సమాచారం. నేతలిద్దరి హత్యతో కలకలం సృష్టిం చడంతో పాటు ఏవోబీలో తమ పట్టు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు మావోలు పక్కా ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే డుంబ్రి గూడ మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని లివిటిపుట్టు గ్రామాన్ని ఆపరేషన్‌కు ఎంచుకున్నట్టు చెబు తున్నారు. వాస్తవానికి కిడారి ఇటీవలి కాలంలో ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తృతంగా పర్యటించారు. గ్రామదర్శిని కార్యక్రమానికి గత శుక్రవారం మావోల అడ్డాగా పేరొందిన పెదబయలు మం డలం పెదకోడాపల్లితోపాటు అంతకుముందు  పర్రెడ పంచాయతీలో కూడా పర్యటించారు. ఆ పర్యటనల్లో ఒకింత బందోబస్తు ఉన్నప్పటికీ మావోలను నిలువరిం చే సంఖ్యలో మాత్రం పోలీసులు లేరు.  అయి తే ఆయా ప్రాంతాల్లో మావోలు దాడి చేయకుండా వ్యూహాత్మకంగానే లివిటిపుట్టును ఎంచుకున్నట్టు అర్ధమవుతోంది. డుంబ్రిగూడ మండల కేంద్రానికి సమీపంలో ఉండటం తో పాటు ఒడిశాకు దగ్గరగా ఉండటం, ఈ ప్రాంతంపై పోలీసులు ఏమాత్రం దృష్టి పెట్టని పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న మావోలు వ్యూహాత్మకంగానే లివిటిపుట్టులో ఆపరేషన్‌కు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

మావోల అదుపులో ఇన్‌ఫార్మర్లు
పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాల్లో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమాలకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, సోమాలు వచ్చినప్పుడు ఎంత మంది పోలీసులు భద్రతగా వస్తున్నారనే దానిపై పిన్‌ పాయింట్‌గా తెలుసుకునేందుకు మావోలు ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక గ్రామాల్లో పోలీసు ఇన్‌ఫార్మర్లుగా పని చేస్తున్నవారిని ముందుగానే  గుర్తించి వారందరినీ ఇళ్ల నుంచి బయటకు రాకుండా కట్టడి చేసినట్లు తెలుస్తోంది. ఆ విధంగా తమ కదలికల సమాచారం బయటకు పొక్కకుండా మావోయిస్టులు పక్కా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెబుతున్నారు. పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ తదితర ఏవోబీ సరిహద్దు  మండలాల్లోని జామిగుడ, గిన్నెలకోట, ఇంజరి, భూషి పుట్టు, రంగబయలు తదితర ప్రాంతాల్లోని పోలీసు ఇన్‌ఫార్మర్లను అన్ని వైపుల నుంచి కట్టడి చేశారు. ఇన్‌ఫార్మర్లను హతమారిస్తే పోలీసులు అప్రమత్తం అవుతారని.. అప్పుడు ఆపరేషన్‌ కిడారి అమలు చేయడం సాధ్యం కాదని గుర్తించే.. ఇన్‌ఫార్మర్లను కట్టడి చేయడానికే పరిమితయ్యారని తెలుస్తోంది. ఇలా రెండు నెలల నుం చి అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే అనుకు న్న ఆపరేషన్‌ను పక్కాగా అమలు చేశారని తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు