జిల్లా ఏజెన్సీలో మావోయిస్టుల యత్నం

9 Feb, 2015 04:29 IST|Sakshi
జిల్లా ఏజెన్సీలో మావోయిస్టుల యత్నం

జిల్లా ఏజెన్సీలో మావోయిస్టుల యత్నం
     సరిహద్దుల్లో నాలుగు దళాల సంచారం
     మొగ్గలోనే తుంచాలనుకుంటున్న పోలీసులు
 
 తూర్పు మన్యంలో ఒకనాడున్న పట్టున్న తిరిగి సాధించాలని మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. పార్టీని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. నాలుగు దళాలుగా విడిపోయి యువకులును ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో ప్రాబల్యం ఉన్న గ్రామాలను సందర్శించి, బలసమీకరణ చేస్తున్నారు. క్రమంగా ఏజెన్సీ అంతా విస్తరించాలన్నది వారి సంకల్పం. కాగా మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ.. మొగ్గలోనే తుంచేయాలని పోలీసులు భావిస్తున్నారు.
 
 రంపచోడవరం :జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన యువతను ఆకట్టుకోవడం ద్వారా మునుపటి బలాన్ని సముపార్జించాలని మావోయిస్టులు ఆశిస్తున్నారు. అయితే వారు అటువైపు ఆకర్షితులు కాకుండా చూసేందుకు పోలీసులు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మావోయిస్టులకు సహకరిస్తున్న సానుభూతిపరులు, మిలీషియా సభ్యులను కట్టడి చేసి వారికి ఎటువంటి సహకారం అందకుండా చర్యలు చేపట్టారు. జిల్లాలో మావోయిస్టు పార్టీ బలంగా ఉన్నప్పుడు మిలిటరీ ప్లాటూన్‌లుగా, దళాలుగా సంచరిస్తూ తమ కార్యకలాపాలు సాగించింది. అనంతర కాలంలో జరిగిన పరిణామాలతో తూర్పు ఏజెన్సీలో మావోయిస్టులు పూర్తిగా పట్టుకోల్పోయారు. అప్పుడు ఎల్లవరం, కోనలోవ, కోరుకోండ , గాలికొండ, గుర్తేడు వంటి పేర్లతో దళాలు విస్తృతస్థాయిలో పనిచేశాయి.
 
 పరిస్థితులు తారుమారు కావడంతో ఆత్మరక్షణ లో  పడ్డ మావోయిస్టులు ఒకే గ్రూపుగా సంచరిస్తూ విశాఖ, తూర్పు సరిహద్దు ప్రాంతానికి పరిమితమయ్యారు. మావోయిస్టు ఉద్యమం వైపు వెళ్లేందుకు గిరిజనులు సైతం విముఖత చూపడంతో ఆ పార్టీకి క్యాడర్ అనేది లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం తిరిగి మళ్లీ తూర్పు-విశాఖ సరిహద్దులో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుత మావోయిస్టులు నాలుగు దళాలుగా విశాఖ, తూర్పు సరిహద్దు గ్రామాల్లో సంచరిస్తున్నట్టు సమాచారం. వీటిలో ఒక గ్రూపునకు ఒడి శాకు చెందిన నాయకుడు నేతృత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో గ్రూపునకు కుడుముల రవి సారథ్యం వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ ప్రాంతంపై పట్టు ఉంటుందనే ఉద్దేశంతో మావోయిస్టు పార్టీ ాయకులు రవికి బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.
 
 నిధుల సమీకరణ యత్నానికి గండి
 కాగా తూర్పు ఏజెన్సీలో పట్టు కోల్పోయిన మావోయిస్టులు తిరిగి బలపడే క్రమంలో నిధులు సమీకరించకుండా నిరోధించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దీంతో మావోయిస్టులకు నిధుల సమీకరణ కష్టతరంగా మారిందంటున్నారు. మావోయిస్టుల పేరు చెప్పి డబ్బులు వసూలు చేసేందుకు ఎవరూ సాహసించకపోవడం, అలాగని మావోయిస్టులే నేరుగా వెళ్లి నిధులు సేకరించే అవకాశాలు లేకపోవడం ఇందుకు ప్రధాన  కారణం.  తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారర  లేదని పోలీసులు అంటున్నారు.  విశాఖ-తూర్పు సరిహద్దులో మాత్రమే వారి కదలికలు ఉన్నట్లు చెబుతున్నారు. కాగా జిల్లాలో ఖమ్మం నుంచి విలీనమైన మండలాల్లో  మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఆ ప్రభావం తూర్పు ఏజెన్సీపై పడకుండా పోలీసులు మావోయిస్టుల అణచివేతకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన సోమవారం న్యూఢిల్లీలో మావోయిస్టుల సమస్యపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు పాల్గొనే సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కూడా మన్యంలో మునుముందు ఏమి జరగనుందో నిర్దేశించగలవు.
 

మరిన్ని వార్తలు