డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ విందు బాగోతం

17 Sep, 2019 08:05 IST|Sakshi
మెడికల్‌ స్టోర్‌ నిర్వాహకునితో కలిసి ఓ డాబాలో విందు ఆరగిస్తున్న డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ దాదాఖలందర్‌

జండు మహదేవి మెడికల్‌ స్టోర్‌పై బాధితుడి ఫిర్యాదు

తనిఖీకి వెళ్లిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ దాదాఖలందర్‌

అంతకు ముందే మెడికల్‌ స్టోర్‌ నిర్వాహకులతో విందు

కళ్యాణదుర్గం రూరల్‌: ఓ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ విందుబాగోతం వివాదాస్పదమైంది. మెడికల్‌ స్టోర్‌లో తనిఖీకి వెళ్లిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌...తనిఖీల కంటే ముందుగానే ఓ డాబాలో మెడికల్‌ షాపు నిర్వాహకులతో కలిసి విందులో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని జండు మహదేవి మెడికల్‌ స్టోర్‌లో కొద్ది రోజుల క్రితం ఓ గొర్రెల కాపరి జీవాల కోసం మందులను కొనుగోలు చేశాడు. అయితే వాటిని వాడకపోవడంతో వెనక్కు తీసుకోవాలని కోరగా దుకాణం నిర్వాహకులు అతనిపై దాడి చేశారు. దీనిపై గొర్రెల కాపరి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. సోమవారం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ దాదాఖలందర్‌ తనిఖీ కోసం కళ్యాణదుర్గం వచ్చారు. అయితే తనిఖీల కంటే ముందుగానే మెడికల్‌ షాపుల నిర్వాహకులతో కలిసి ఓ డాబాలో విందు చేశారు. అనంతరం దుకాణంలో తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టారు. 

అన్నీ నిబంధనలకు విరుద్ధమే
జండు మహదేవి మెడికల్‌ స్టోర్‌ నిబంధనల ప్రకారం మందులు విక్రయించడం లేదని ఇన్‌స్పెక్టర్‌ దాదాఖలందర్‌ తనిఖీల్లో గుర్తించారు. అంతేకాకుండా అనుమతులు లేని మందులు భారీ స్థాయిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. విందు బాగోతం రచ్చ కావడంతో ఈ విషయాలన్ని మీడియా ప్రతినిధులకు కూడా తెలిపారు. సమగ్ర వివరాలతో ఏడీకి నివేదిక పంపుతానని వెల్లడించారు. మరోవైపు పట్టణంలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీలు చేస్తున్నారని తెలియడంతో పలు మెడికల్‌ షాపుల యజమానులు దుకాణాలను మూసి వేశారు.  

మరిన్ని వార్తలు