ఆరోజు.. ఈరోజు.. తమ్ముళ్ల దౌర్జన్యకాండ

17 May, 2019 10:53 IST|Sakshi
ఎన్‌ఆర్‌ కమ్మపల్లిలోకి వెళ్లకుండా చెవిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు

సాక్షి, తిరుపతి: ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నేతలు తమ నిజస్వరూపాన్ని ప్రదర్శించారు. ఓడిపోతామని భయపడి చంద్రగిరి నియోజక వర్గ పరిధిలోని దళితులకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా అగ్రకులాల వారు అడ్డుకుని దాడులకు తెగబడ్డారు. ఇదేమిటని ప్రశ్నించడానికి వెళ్లిన ఎమ్మెల్యేపైనా దాడికి పూనుకున్నారు.

చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన రిగ్గింగ్, టీడీపీ నేతల అరాచకాలపై ఎన్నికల కమిషన్‌ కొరఢా ఝులిపించింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే ప్రజాస్వామ్యం ఖూనీ కావడం.. ఆ ప్రాంతంలో రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్‌ ఆదేశించడంతో టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. గురువారం మళ్లీ వైఎస్‌ఆర్‌సీపీ సానుభూతిపరులపై దాడులకు పాల్పడి భయాందోళనకు గురిచేస్తున్నారు. కనీసం ఆ గ్రామంలోకి ఎమ్మెల్యేని రాకుండా అడ్డుకున్నారు.

నాడు : యథేచ్ఛగా రిగ్గింగ్‌
ఏప్రిల్‌ 11న పోలింగ్‌ సందర్భంగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో టీడీపీకి వ్యతికేకంగా ఓట్లు పోలవుతాయని గ్రహించిన తెలుగు తమ్ముళ్లు రామచంద్రాపురం మండలంలోని రావిళ్లవారిపల్లి, కమ్మపల్లి, కమ్మకండ్రిగ, టీటీ కండ్రిగ, ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, గణేశ్వరపురంలో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓట్లేస్తారని తెలిసి స్థానికులు ఎవరినీ పోలింగ్‌ బూత్‌ వద్దకు రాకుండా రిగ్గింగ్‌కు పాల్ప డ్డారు. విషయం తెలుసుకుని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పత్రికా విలేకరులు, మీడియా ప్రతినిధులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

వీరెవరినీ గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించారు. విలేకరులపై దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. కెమెరాలు, ఐడీ కార్డులు లాక్కున్నారు. అదే విధంగా సొరకాయలపాలెం, తుమ్మలగుంటలో టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డేలేకుండా పోయింది. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ టీడీపీ ఏజెంట్లు మినహా మిగిలిన పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను కూడా గ్రామంలోకి అడుగుపెట్టనివ్వలేదు.

తాటితోపు కండ్రిగ పోలింగ్‌ కేంద్రం వద్ద స్వతంత్ర అభ్యర్థి పూర్ణిమపై దాడిగి తెగబడ్డారు. టీడీపీ ఏజెంట్లు రిగ్గింగ్‌కు పాల్పడుతుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే టీడీపీ నాయకుడు కేశువులునాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు స్వతంత్ర మహిళా అభ్యర్థిని చుట్టుముట్టి దాడిచేసేందుకు యత్నించాయి. గంటపాటు ఆమెను ఎటూ వెళ్లకుండా నిర్భందించి మొబైల్‌ ఫోన్‌ లాక్కున్నారు. ఇలా రామచంద్రాపురం మండల పరిధిలో అనేక పోలింగ్‌ బూత్‌ పరిసర ప్రాంతాల్లోకి కూడా ఎవరినీ రాకుండా గేట్లు వేసి అడ్డుకుని యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.

నేడు : రీపోలింగ్‌ జరిగితే నష్టపోతాయని మళ్లీ దాడులు
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఐదు బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహిం చాలని ఈసీ నిర్ణయం తీసుకోవడంతో టీడీపీ నేతలు జీర్ణించుకోలేపోయారు. రీపోలింగ్‌ నిర్వహించేందుకు దళితులే కారణమని తెలిసి ఎన్‌ఆర్‌ కమ్మపల్లిలో ముగ్గురు దళితులపై టీడీపీ నేతలు దాడిచేశారు. విషయం తెలుసుకుని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి గురువారం సాయంత్రం బాధితులను పరామర్శించేందుకు గ్రామాని కి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, స్థానిక నా యకులు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు.

అంతటితో వదలని టీడీపీ నాయకులు దాడికి తెగబడ్డారు. విషయం తెలుసుకుని రంగప్రవేశం చేసిన పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. టీడీపీ నాయకులపై చర్యలకు సాహసించని పోలీసులు మరో సారి ఎమ్మెల్యే చెవిరెడ్డిని గురువారం రాత్రి అరెస్టుచేసి రేణిగుంట పోలీస్టేషన్‌కు తరలించారు. అంతటితో ఆగని టీడీపీ నేతలు గ్రామంలో దళితులకు రాత్రంతా తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. రీపోలింగ్‌ జరిగినా.. ఎవరూ ఓటెయ్యటానికి వీల్లేదని హుకుం జారీ చేయడం ప్రారంభించారు. పోలింగ్‌ కేంద్రానికి వస్తే.. తిరిగి వెళ్లలేరంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రాత్రంతా గ్రామంలో టీడీపీ నేతలు దళితుల నివాసాల చుట్టూ కేకలు వేస్తూ.. సవాల్‌ విసురుతూ.. భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో దళితులు రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడిపారు.

మరిన్ని వార్తలు