పక్షపాతం లేకుండా విధులు నిర్వహించాలి

20 May, 2019 09:34 IST|Sakshi
పోస్టల్‌ బ్యాలెట్‌పై అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నకలెక్టర్‌ 

సాక్షి, ఒంగోలు అర్బన్‌: ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎటువంటి పక్షపాతం లేకుండా విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌చంద్‌ అధికారులకు సూచించారు. ప్రకాశం భవనంలోని ఎన్నికల కంట్రోలు రూములో ఆదివారం సహాయ రిటర్నింగ్‌ అధికారులు, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, నోడల్‌ అధికారులకు పోస్టల్‌ బ్యాలెట్, ఎలక్ట్రానికల్లి ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్లపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ ఏర్పాటుకు చేసిన టేబుల్‌ వద్ద ఒక సహాయ రిటర్నింగ్‌ అధికారి, కౌంటింగ్‌ సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్‌ అసిస్టెంట్లలతో పాటు ఒక సూక్ష్మ పరిశీలకులు ఉంటారన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో భారత ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను అనుసరించి విధులు నిర్వహించాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు సంంధించి కవర్‌ బీ లో ఉన్న ఫారం 13సీ, 13ఏని జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ప్రతి టేబుల్‌కు పోస్టల్‌ బ్యాలెట్‌ కవర్‌లు 500 చొప్పున బండిల్‌ కట్టి, చెల్లుబాటు కానీ పోస్టల్‌ బ్యాలెట్‌లను విడిగా ఒక కవర్‌లో ఉంచాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి 7 కారణాలతో ఇన్‌వాలిడ్‌గా ప్రకిటించే అంశాలను కలెక్టర్‌ అధికారులకు వివరించారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌కు సంబంధించి సహాయ రిటర్నింగ్‌ అధికారి నిర్ణయాధికారి అని తెలిపారు. ఓట్ల లెక్కింపులో కౌంటింగ్‌ అసిస్టెంట్‌లను సమర్ధవంతగా వినియోగించుకుని ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. 13ఏలో ఓటర్లు సంతకంతో పాటు గిజిటెడ్‌ అధికారి అటెస్టేషన్‌ కలిగి ఉండాలనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఎలక్ట్రానికల్లి ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ పద్ధతిలో కౌంటింగ్‌ ప్రక్రియలో చేపట్టాల్సిన చర్యల గురించి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అధికారులకు వివరించారు. 13ఏ, 13బీ, 13సీ ఫారాలను తప్పనిసరిగా స్కాన్‌ చేయాలన్నారు. స్కానింగ్‌కు సంబంధించి క్యూర్‌కోడ్‌ రీడర్‌ను సంసిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇన్‌వాలిడ్‌కు సంబంధించి 13సీ కవర్‌ వెనుక భాగాన తగిన కారణాలను తెలపాల్సి ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో ప్రత్యేక కలెక్టర్‌ చంద్రమౌళి, సంయుక్త కలెక్టర్‌లు నాగలక్ష్మి, సిరి, డీఆర్‌ఓ వెంకటసుబ్బయ్య, రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారుల ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు