సూపరింటెండెంట్‌కు ‘ఈవో’ బాధ్యతలు

13 Jun, 2014 02:19 IST|Sakshi

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో వై.రామచంద్రారెడ్డి గురువారం రాత్రి ఆలయ బాధ్యతలను సూపరింటెండెంట్ శ్రీనివాసులురెడ్డికి అప్పగించి వెళ్లిపోయారు. బుధవారం ఆలయ ఈవోను రాష్ట్ర దేవాదాయశాఖకు బదిలీ చేస్తున్నట్లు కమిషనర్ అనురాధ ఉత్తర్వులు పంపిన విషయం తెలిసిందే. కాగా మరోవైపు ఆలయ ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్, కాంట్రాక్టర్లు ఈవో రామచంద్రారెడ్డి నియామకం చెల్లదని హైకోర్టులో వేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖ కమిషనర్ ప్యూహత్మకంగా వ్యవహరించారు.

గురువారం ఈవోను రిలీవ్ చేయించి ఆ ఫైల్‌ను సూపరింటెండెంట్ ఫ్యాక్స్ ద్వారా క మిషనర్‌కు పంపించారు. శుక్రవారం హైకోర్టులో విచారణ సందర్భంగా కమిషనర్ శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవోను బదిలీ చేసినట్లు తగిన ఆధారాలు చూపనుంది. దీంతో కోర్టు ఆ కేసును కొట్టివేస్తుందనే ఉద్దేశంతోనే బదిలీ వేటు పడిందని ఆలయాధికారులు బాహాటంగానే చెబుతున్నారు. ఇక నూతనంగా ఈవో బాధ్యతలు చేపట్టనున్న తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా వాసి తిరుపతి ఆర్జేసీ శ్రీనివాసరావు హైదరాబాద్‌లోని దేవాదాయశాఖ కార్యాలయంలోనే శుక్రవారం బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు