ఎర్రబెల్లి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు: చంద్రబాబు

18 Oct, 2013 21:05 IST|Sakshi
ఎర్రబెల్లి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు: చంద్రబాబు

హైదరాబాద్: సమైక్య శంఖారావం పేరుతో ఈ నెల 26న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభను టీడీపీ అడ్డుకోబోదని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎవరు ఏమిటో ప్రజలే చూసుకుంటారని చెప్పారు. మీ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావు వైఎస్సార్‌సీపీ హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తే మరో మహబూబాబాద్ ఘటన పునరావృత ం అవుతుందని ప్రకటించారు కదా అని ప్రశ్నించగా ఆయన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, అవి వ్యక్తిగతమని అన్నారు.
 
రాష్ట్ర విభజన అంశంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన మంత్రుల బృందం పనితీరుపట్ల చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు ఏమి చేస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరటాన్ని  ఆయన తప్పుపట్టారు. రాష్ర్ట ప్రజలతో మంత్రుల బృందం ఆడుకుంటోందన్నారు. విభజన విషయమై రోజుకు మూడుసార్లు దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతున్నారని, అయితే ఆయన ఏం మాట్లాడుతున్నారో  ఎవ్వరికీ అర్థం కావటం లేదన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు  టెన్ జన్‌పథ్‌కు కట్టుబానిసలుగా మారారని అన్నారు.

మరిన్ని వార్తలు