రాష్ట్రం నీ బాబు సొత్తు కాదు

29 Apr, 2018 11:18 IST|Sakshi
మాజీ మంత్రి కొలుసు పార్థసారథి

కంకిపాడు/ఉయ్యూరు : చంద్రబాబూ...ఖబడ్దార్‌. రాష్ట్రం నీ బాబు సొత్తు కాదు’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఉయ్యూరులోని మార్కెట్‌ సెంటరులో శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర బహిరంగ సభలో పార్థసారథి ప్రసంగించారు. పేదవాడికి రేషన్‌కార్డు, పక్కా ఇల్లు, ఇంటి స్థలం, పింఛను ఏ ఒక్కటి ఇవ్వాలన్నా వాళ్ల బాబు సొమ్ము పోతున్నట్లు టీడీపీ ప్రభుత్వం బాధపడుతుందని మండిపడ్డారు. టీడీపీ తన పాలనలో ఉయ్యూరులో ఏ ఒక్కరికీ సెంటు భూమి ఇచ్చి, ఇల్లు కట్టించలేదన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు సేకరించారని గుర్తు చేశారు. 
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై ఆగ్రహం.... 
పార్థసారథి మాట్లాడుతూ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘జనాల కోసం డ్యాన్సులు వేయటం మాకు చేతకాదు.. ఉయ్యూరు సెంటరులో జనంతో చప్పుట్లు కొట్టించుకునేందుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు డ్యాన్స్‌లు వేశారు... ప్రజలు కడుపుకాలి ఆకలితో బాధపడుతుంటే డ్యాన్సులు ఎవరైనా వేస్తారా?... ప్రజలు కష్టాలు తెలుసుకుని ఆకలి తీర్చేందుకు వైఎస్‌ కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చారు కాబట్టే వేలాదిగా జనం తరలివచ్చారన్నారు.
ఈశ్వరయ్య లేఖపై నోరెత్తలేని దద్దమ్మ...
జస్టిస్‌ ఈశ్వరయ్య బీసీలకు న్యాయమూర్తుల ఎంపికపై జరుగుతున్న అన్యాయంపై బహిరంగంగా లేఖ రాస్తే సమాధానం చెప్పలేని దద్దమ్మ చంద్రబాబు కాదా? అన్నారు. కేంద్రం ఈశ్వరయ్య వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు తేలితే చంద్రబాబును బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు ఒక్క రూపాయి కూడా పేదల నుంచి తీసుకోకుండా రూ.3 లక్షలతో ఇళ్లు కట్టించేందుకు చర్యలు తీసుకోవాలని, కాల్వ కట్ల వాసులకు పూర్తి భరోసా ఇవ్వాలని జగన్‌కు  విజ్ఞప్తిచేశారు.  

మరిన్ని వార్తలు