'మౌనంగా ఉంటే నేరాన్ని అంగీకరించినట్లేగా'

16 Feb, 2020 20:36 IST|Sakshi

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతి బాగోతంపై దర్యాప్తును ఈడీకి అప్పగించాలని చేయాలని ఐటీ ఎక్స్‌పర్ట్‌ వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశారు. రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా ఐటీ శాఖ విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో స్పష్టంగా పేర్కొంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఐటీ శాఖ పంచనామాలోని ఒక పేజిలోని రెండు లైన్లను తీసుకొని, తామేమి తప్పు చేయలేదన్నట్లుగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వేణుగోపాల్‌ అన్నారు. ఐటీ దాడులపై ఆయన మాట్లాడుతూ.. 'ప్రజలను తప్పుదారి పట్టించేందుకే టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ నివాసంలో నగదు, బంగారం సీజ్‌ చేసిన సమయంలో ప్రోటోకాల్‌ ప్రకారం ప్రకారం ఐటీ అధికారులు పంచనామా ఇచ్చి, స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేస్తారు. ఐపీ అడ్రస్‌లన్నీ ఒకే చోట ఉన్నాయి.

కంపెనీ అడ్రస్‌లన్నీ ఫేక్‌ అని తేలాయి. బోగస్‌ ఇన్‌వాయిస్‌లను సృష్టించి డబ్బును తరలించారు. మనీలాండరింగ్‌ జరిగిందని ఐటీ అధికారులు స్పష్టం చేశారు. ఓవర్‌ ఇన్‌వాయిస్‌, బోగస్‌ ఇన్‌వాయిస్‌లను ఐటీ శాఖ గుర్తించింది. చట్టం ముందు ఎవరూ అతీతులు కాదు. మీరు జరిపినవి బినామీ ట్రాన్సాక్షన్‌లు అయితే శిక్ష అనుభవించాల్సిందే. వ్యవహారంపై ఐటీ దాడులతో పాటు ఈడీతో విచారణ చేయించాలి. స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన తర్వాత ఐటీ శాఖ అందరికీ నోటీసులు ఇస్తుంది. వారు నోటీసులకు సమాధానం ఇవ్వకుంటే షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తుంది. ఈ విచారణ మొత్తం రాష్ట్ర పరిధిలోనిది అయితే రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయవచ్చని' ఆయన పేర్కొన్నారు.   చదవండి: ఐటీ దాడులపై ఆయన నోరు మెదపరేం..?

కార్పోరేట్‌ న్యాయనిపుణులు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. 'ఈ వ్యవహారంపై ఐటీ దాడులతో పాటు సీబీఐ, ఈడీ, ఎస్‌ఎఫ్‌ఐఓలతో విచారణ చేయించాలి. అక్రమాలకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయడంతో పాటు.. బ్యాంక్‌ అకౌంట్లని సీజ్‌ చేసి ఇన్వెస్టిగేషన్‌ని వేగవంతం చేయాలి. ఎల్లో మీడియా అన్ని ఆధారాలు చూపించకుండా కేవలం ఒక పేజీని మాత్రమే చూపిస్తూ విషయాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తోంది. త్వరలోనే దొంగలందరూ బయటపడతారు. ఈ స్కామ్‌ రూ.2వేల కోట్ల నుంచి రూ. 2లక్షల కోట్ల వరకూ వెళ్లే అవకాశం ఉంది. శ్రీనివాస్‌ నివాసంలో ఐటీ దాడులపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా చంద్రబాబు ఈ దాడులపై స్పందించాలని' డిమాండ్‌ చేశారు.   చదవండి: ఐటీ ఉచ్చులో అవినీతి చక్రవర్తి

చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ నివాసంలో ఐటీ దాడులపై హైకోర్టు న్యాయవాది జనార్ధన్‌ మాట్లాడుతూ.. 'ఇండియా చరిత్రలోనే ఇది ఒక పెద్ద స్కామ్‌. ఐటీ శాఖ ఆరు రోజులు సోదాలు జరిపితే రెండు పేజీల రిపోర్టు మాత్రమే రాస్తారా..!. ఈ స్కామ్‌లో చంద్రబాబు అండ్‌ కో తప్పించుకునే సమస్య లేదు. అమరావతి నిర్మాణం పేరుతో వేలకొట్లు దోచుకున్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తుంటారు. వాస్తవాలన్నీ త్వరలోనే బయటపడతాయి. దోషులు మౌనంగా ఉంటున్నారంటే నేరాన్ని అంగీకరించినట్లేని' ఆయన తెలిపారు. మరో న్యాయవాది వెంకటేశ్‌ శర్మ మాట్లాడుతూ.. 'ఐటీ దాడులపై మాట్లాడేందుకు టీడీపీ నేతలు జంకుతున్నారు. ఒక వ్యక్తిని బలిపశువును చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. దొరికిన ఒక్క కాగితంతోనే శ్రీనివాస్‌ మంచివాడని చూపించే ప్రయత్నాల్లో ఎల్లో మీడియా ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో నాపై ఐటీ దాడలు జరగకూడదు అంటే తనని గెలిపించాలని ప్రచారం చేశారంటేనే చంద్రబాబు బాగోతం అర్థమవుతుందన్నారు. అవినీతి చేశారు కాబట్టే చంద్రబాబు అండ్‌ కో భయపడుతున్నారని' ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు