విద్యార్థులకు షాక్

19 Nov, 2013 02:17 IST|Sakshi

 సాక్షి, గుంటూరు: ఎట్టకేలకు కళాశాల, హాస్టల్ ఫీజులు మంజూరయ్యాయని మురిసిపోతున్న విద్యార్థులకు పెద్దషాక్ తగిలింది. సంక్షేమ శాఖ అధికారులు పంపిన బ్యాంక్ అకౌంట్ నంబర్లు సక్రమంగా లేవని నిధులు విడుదలకు నోచుకోక ఖజానాలో మూలుగుతున్నాయి. మరోవైపు కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్లో ఇదొకటి. 2012-13 విద్యా సంవత్సరానికి ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ కోరుతూ వివిధ సంక్షేమ శాఖల ద్వారా 62వేల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ద్వారా ప్రభుత్వం అందజేస్తోంది.
 
 ఈ విధానంలో కిందటి ఏడాది జిల్లా ఖజానా శాఖ నుంచి రూ.120 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి. మరో రూ.12 కోట్లు విడుదల కావాల్సి ఉందని సంక్షేమ శాఖల అధికారు లు రెండు నెలల క్రితమే వెల్లడించారు. ఈ ఏడాది రెన్యూవల్ చేసుకోవాల్సిన విద్యార్థులకు కళాశాలల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. కిందటి ఏడాది అందాల్సిన ట్యూషన్ ఫీజులకే దిక్కులేదని, ప్రస్తుత ఏడాది కూడా ప్రభుత్వంపై నమ్మకం ఉంచి చదువులు చెప్పలేమని యాజమాన్యాలు చేతు లెత్తేస్తున్నాయి. ఈ విషయంపై ‘సాక్షి’ ఆరా తీయగా ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన బకాయిలు వచ్చాయని, అయితే అకౌంట్ నంబర్లలో తేడా వచ్చి జిల్లా ఖజానాలో వున్నాయని తెలిసింది. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలులో నోడల్ ఏజెన్సీ లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతు న్నాయనే భావన అంతటా వ్యక్తమవుతోంది.  
 

>
మరిన్ని వార్తలు