సాక్షి, తిరుమల: తిరుమల కొండమీదున్న అదనపు బూందీ పోటులో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. పోటులోని 3,4 పొయ్యిల నుంచి మంటలు ఎగసి పడటంతో దాదాపు అరగంట పాటు ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. సేకరించిన వివరాల ప్రకారం, ఆలయం వెలుపల ఉన్న అదనపు బూందీ పోటులో సాయంత్రం 3.20 గంటలకు మంటలు రేగాయి.
వెంటనే స్పందించిన బూందీ సిబ్బంది, ఫైర్ సర్వీస్ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో విజిలెన్స్ జిమ్మేదారు భాస్కర్రెడ్డితో పాటు మరో ఉద్యోగి స్వల్పంగా గాయపడ్డారు. వీరిని వెంటనే ఆశ్విని ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా తిరుమల జేఈవో శ్రీనివాసరాజు మాట్లాడుతూ, సంఘటనపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ప్రమాదం కారణంగా తాత్కాలికంగా బూందీ తయారీ నిలిచిపోయింది.