శేషాచలం అడవుల్లో మంటలు

23 Mar, 2019 22:21 IST|Sakshi

ఆలస్యంగా సంఘటనా స్థలం చేరుకున్న ఫైర్‌ సిబ్బంది, ఫారెస్టు అధికారులు  

సాక్షి, చిత్తూరు :  తిరుమల శేషాచలం అడవుల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. మొదటి ఘాట్‌రోడ్డులోని 33వ మలుపు వద్ద సాయంత్రం 6 నుంచి మంటలు ఎగిసిపడుతున్నా కనీసం ఫారెస్టు అధికారులు, ఫైర్‌ సిబ్బంది, విజలెన్స్‌ సిబ్బందికి సమాచారం అందలేదు. సుమారు ఒకటిన్నర గంట ఆలస్యంగా తెలుసుకున్న అధికారులు హుటాహుటీన ఫైర్‌ ఇంజన్‌తో విజిలెన్స్‌ సిబ్బంది, ఫారెస్టు సిబ్బంది ఘటనాస్థలానికి  చేరుకున్నారు. అంతకుముందుగా తిరుమల నుంచి తిరుపతికి వెళ్లేస్థానికులు , భక్తులు ఈ మంటలను చూసి తమ వంతుగా మంటలను అదుపు చేసేందుకు అడవిమార్గంలోకి వెళ్లారు.

అయినా వారి ప్రయత్నంతో కొద్దిసేపు మంటలు ఆగినా ఒక్కసారిగా ఈదురుగాలులు తోలడంతో మళ్లీ మంటలు చెలరేగాయి. దీంతో ఏమీ చేయలేని పరిస్థితిలో టీటీడీ టోల్‌ప్రీ నెంబర్‌కు స్థానికులు, భక్తులు ఫోన్‌ చేశారు. అయినా మంటలు అదుపు కాకపోవడంతో రోడ్డుపై ప్రయాణించే వాహనదారులపై నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో కొద్దిసేపు వాహనాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో భక్తులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణించారు. టీటీడీ అధికారులు రావడం ఆలస్యం కావడంతో అప్పటికే సుమారు 4 నుంచి 5 ఎకరాల విస్తీర్ణం ఆహుతైంది. 
 

మరిన్ని వార్తలు