మాజీ కానిస్టేబుల్‌ అరెస్ట్‌

4 Mar, 2018 11:44 IST|Sakshi

విజయనగరం టౌన్‌: రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ ప్రజలను మోసం చేసిన మాజీ కానిస్టేబుల్‌ను టూటౌన్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. దీనికి సంబంధించి టూటౌన్‌ సీఐ బీవీజే రాజు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. రమేష్‌పాత్రో కానిస్టేబుల్‌ వృత్తిలో ఉంటూ  డబ్బు సంపాదించాలన్న అత్యాశతో  రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలోకి దిగి ఉద్యోగాన్ని వదిలేశాడు. ఈ నేపథ్యంలో పలు మోసాలకు పాల్పడి రెండు  కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. కానుకుర్తివారి వీధిలో పీఆర్‌ ఎన్‌క్లేవ్‌లో 14 ఇళ్లను  ఒకరికి తెలియకుండా ఒకరికి అమ్మేసి ప్రజలను మోసం చేశాడు.

దీనిపై పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో గతేడాది డిసెంబర్‌ 20న కేసు నమోదు చేసి మాజీ కానిస్టేబుల్‌ను అరెస్ట్‌ చేశారు. బెయిల్‌పై వచ్చి మరలా తన రియల్‌ మోసాలను యథేచ్ఛగా కొనసాగించడంతో, బాధితులు మళ్లీ ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన  పోలీసులు శనివారం స్థానిక ఐస్‌ ఫ్యాక్టరీ జంక్షన్‌ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు