ఒకటి నుంచి ‘నగదు బదిలీ’

11 Sep, 2013 05:43 IST|Sakshi

 విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : నగదు బదిలీ పథకం అమలుకు జిల్లాలో సన్నాహాలు ప్రారంభమయ్యాయి. వంట గ్యాస్‌తో ఈ పథకానికి కేంద్రం శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో మెదక్, నెల్లూరు జిల్లాలతో పాటు విశాఖ జిల్లాలో కూడా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో 9,44,694 మంది వంట గ్యాస్ వినియోగదారులకు ఈ నగదు బదిలీ పథకం వర్తించనుంది. ఫలితంగా గ్యాస్ సబ్సిడీ డబ్బులు నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకే జమకానున్నాయి. ఈ పథకం వర్తించాలంటే ఆధార్ కార్డు తప్పని సరి. లేనిపక్షంలో నాన్ సబ్సిడీలో రూ.992కు గ్యాస్ సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జిల్లా జాయింట్ కలెక్టర్      ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు డీఎస్‌ఓ జ్వాలాప్రకాష్ ఈ పథకం అమలుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
 జిల్లాలో 93 శాతం ఆధార్ ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో  42,88,113 మంది జనాభా ఉండగా, వీరిలో 39,99,142 మంది ఆధార్ కోసం వివరాలు నమోదు చేసుకున్నారు. ఇందులో వివిధ కారణాల వల్ల 2,90,883 మందివి తిరస్కరించారు. ఇప్పటికే 28,72,127 మందికి సంబంధించి బెంగళూరు యూఐడీఏఐ నుంచి కార్డులు మంజూరు కాగా, ఇంకా 8,36,132 మందివి మంజూరు కావాల్సి ఉంది. ఇవి పోస్టు ద్వారా సంబంధిత వ్యక్తులకు అందడానికి కొంత సమయం పడుతుంది. జనాభా గణాంకాల ప్రకారం ఇంకా 5,79,854 మంది ఆధార్ తీసుకోవాల్సి ఉంది. వీరు అక్టోబర్ ఒకటో తేదీలోగా ఆధార్ కోసం వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంది.  ఒకవేళ ఆధార్ నమోదు చేసుకున్నప్పటికీ కార్డులు రానివారు దగ్గరలో ఉన్న మీసేవా కేంద్రానికి వెళ్లి నిర్ణీత రుసుము చెల్లిస్తే కార్డు వివరాలు తెలియజేస్తారు. ఇంటర్నెట్ ద్వారా ఠీఠీఠీ.ఠజీఛ్చీజీ.జౌఠి.జీ వెబ్‌సైట్‌లో ఆధార్ కార్డు స్థితిగతులను తెలుసుకోవచ్చు. కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 

మరిన్ని వార్తలు