మా గీత మారలేదు...

27 Sep, 2018 07:56 IST|Sakshi
జగన్‌మోహన్‌రెడ్డికి సమస్యలు చెబుతున్న గీత కార్మికులు

శ్మశానంలోనే గుడెసలు... ’ హుద్‌హుద్‌ పరిహారమూ ఇవ్వలేదు..

’ జగనన్న వస్తేనే మా బతుకులు బాగుపడతాయి.. ’ గీత కార్మికులు..

విజయనగరం : టీడీపీ పాలనలో మా బతుకులు మరీ దుర్భరంగా మారాయి.. తాటి, ఈత కల్లు అమ్ముకుని జీవించే మాకు కనీసం ఇళ్లు కూడా లేవు. శ్మశానంలో పూరి గుడెసెలు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నాం.. ఉపాధి లేక అవస్థలు పడుతున్నాం.. హుద్‌హుద్‌ సమయంలో వందలాది ఈత, తాటిచెట్లు నేలకొరిగాయి... అప్పట్లో గీత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటాం.. పరిహారం మంజూరు చేస్తామని హామీలు గుప్పించిన నాయకులు మా వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు.. ఈ ప్రభుత్వ హయాంలో అన్ని విధాలా నష్టపోయాం.. ఆనాడు రాజన్న చల్లని చూపుల్లో ప్రశాంతంగా జీవించాం.. మళ్లీ మాకు రాజన్న పాలన కావాలి.. అందుకే జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు పలకాలని నిర్ణయించుకున్నామని లక్కవరపుకోట మండలం పిల్ల అగ్రహారం గ్రామానికి చెందిన గీత కార్మికులు కండేపల్లి అప్పారావు, ముత్యాలు, గురుమూర్తి, తదితరులు తెలిపారు.

ప్రజా సంకల్పయాత్రలో తమ సమస్యలను జగనన్నకు చెప్పుకోవడానికే వచ్చామని చెమర్చిన కళ్లతో చెప్పారు. లక్కవరపుకోట గీత కార్మికుల సంఘ నాయకుడు జిత్తుక దారకొండ మాట్లాడుతూ, హుద్‌హుద్‌ సమయంలో నష్టపోయిన ప్రతీ ఒక్క కార్మికుడికి (రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వ్యక్తి) రూ. 10 వేల పరిహారం ఇస్తామన్న చంద్రబాబు ఆ ఊసే మరిచిపోయాడన్నారు. మండలంలో 80 మంది రిజిస్ట్రేషన్‌ గీత కార్మికులు ఉన్నామని, పరిహారం కోసం విజయవాడ వెళ్లినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రూ. లక్ష సబ్సిడీతో రెండు లక్షల రూపాయల రుణం ఇస్తామని టీడీపీ నాయకులు చెప్పడంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదని, అలాగే ద్విచక్ర వాహనాలు ఇస్తామన్న హామీ కూడా నెరవేరలేదని వాపోయారు. మా గీత మారాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిందేనని జిత్తుక దారకొండతో పాటు రంగరాయపురం, కూర్మారం గ్రామాల గీత కార్మికులు కోరుకుంటున్నారు.       – ప్రజాసంకల్పయాత్ర బృందం

 బయట వారికే కాంట్రాక్ట్‌
తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామికి నైవేథ్యం పెట్టే మూకుడులు మట్టితో తయారు చేస్తారు. ఆ మూకుడులు తయారు చేసే కాంట్రాక్ట్‌ను టీడీపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కుమ్మరులకు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల వారికిచ్చి ఇక్కడ ఉన్న కుమ్మరులను మోసం చేసింది. ఆ కాంట్రాక్ట్‌ మన వారికి ఇచ్చి ఉంటే ఎంతో మంది కుమ్మర్లకు ఉపాధి లభించేంది. శాలివాహన సంఘ ఫెడరేషన్‌ స్థానంలో కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని.. శాలివాహనులకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం ఆనందంగా ఉంది.

మందులు కొనలేకపోతున్నాం..
మా చెల్లి ఎస్‌కే మేరీకి పదేళ్ల నుంచి ఫిట్స్‌ వస్తోంది. నిరుపేదలమైన మేము ప్రతి 15 రోజులకొకసారి మందులు కొనుగోలు చేయలేకపోతున్నాం. ఫిట్స్‌ వల్ల కాళ్లు, చేతులు పనిచేయడం లేదు. మతిస్థిమితం కూడా లేదు. విశాఖ కేజీహెచ్‌లో చూపిస్తే 15 రోజులకొకసారి కోర్సు వాడాలని చెప్పారు. మూడేళ్ల నుంచి మందులు వాడుతూ ఆర్థికంగా చితికిపోయాం. మా చెల్లిని ఆదుకోవాలని జగనన్నను కోరాం.

ఓరిగంటి రెడ్డిలకు ప్రత్యేక కార్పొరేషన్‌  
ఓరిగంటి రెడ్డి కులానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి. ఈ కులానికి చెందిన వారంతా అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారు. మల్లెపూల తోటల ద్వారా వచ్చిన కొద్దిపాటి ఆదాయంతోనే జీవనం సాగిస్తున్నాం. రోజంతా కష్టపడితే 200 రూపాయలు కూడా రావడం లేదు. మేము పడుతున్న ఇబ్బందులను జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చాను.  

మోడల్‌ స్కూళ్లను విలీనం చేయాలి..
రాష్ట్రంలో 2013లో ప్రారంభించిన మోడల్‌ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలి. కేంద్ర ప్రభుత్వం 2017 బడ్జెట్‌ సమావేశంలో మోడల్‌ స్కూళ్లను డీ లింక్‌ చేసినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విలీనం చేయలేదు. 163 మోడల్‌ పాఠశాలల్లో 2001 మంది ఉద్యోగులు ఉండగా ఇంకా 929 పోస్టులు భర్తీ చేయాలి. ఈ పోస్టులను నేరుగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయకుండా.. 70 శాతం పదోన్నతుల ద్వారా... 30 శాతం డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి. విద్యారంగ సమస్యలపై జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చాం. – కేఏ సత్యనారాయణ,బీఎల్‌ పద్మావతి, జె. అప్పారావు, తదితరులు, మోడల్‌ పాఠశాల ఉపాధ్యాయులు

పార్టీ మారితేనే పింఛన్లట..
అన్ని అర్హతలున్నా అధికార పార్టీ నాయకులు పింఛన్లు ఇవ్వడం లేదు. పార్టీ మారితేనే పింఛన్లు ఇస్తారట. గ్రామంలో ఎంతోమంది అర్హులున్నా టీడీపీకి ఓట్లు వేయలేదనే సాకుతో అన్యాయం చేస్తున్నారు. పింఛన్లతో పాటు సంక్షేమ పథకాలేవీ మాకు ఇవ్వడం లేదు. మా బాధలు జగనన్నకు చెప్పుకునేందుకే వచ్చాం.           – బాధిత మహిళలు, రంగరాయపురం

 రుణపడి ఉంటాం..
పాదయాత్ర ప్రారంభించిన మొదటి రోజే జగన్‌మోహన్‌రెడ్డి సీపీఎస్‌ రద్దుపై ప్రకటన చేయడం ఆనందంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల తరఫున మేమంతా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీపీఎస్‌ రద్దు కోసం మూడేళ్లుగా పోరాడుతున్నా ఎవ్వరూ సహకరించలేదు. ఈ సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలబడడం ఆనందంగా ఉంది.
– ఏపీసీపీఎస్‌ఈఏ ప్రెసిడెంట్‌ బి. మోహనరావు, తదితరులు  

 ప్రత్యేకహోదా జగన్‌తోనే సాధ్యం
ప్రత్యేకహోదా రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. ఆయన మీద ఉన్న నమ్మకంతోనే ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటున్నాం. నవరత్నాలు పథకాలపై ప్లకార్డులతో అవగాహన కల్పిస్తున్నాం. పంట పొలాలు పచ్చగా ఉండాలంటే నీరు కావాలి.. రైతు చల్లగా ఉండాలంటే జగనన్న రావాలి.. యాత్రకు రైతుల నుంచి విశేష స్పందన వస్తోంది. 
– వజ్రాల శ్రీనివాసులరెడ్డి,వెంకటరామిరెడ్డి, బి. వెంకటేష్, గాదె బ్రహ్మారెడ్డి, పింగల అశోక్‌రెడ్డి, తదితరులు బెల్లంకొండ, గుంటూరు జిల్లా

మరిన్ని వార్తలు