పాస్‌ ఉంటే పగటి పూటే అనుమతిస్తాం

1 Jul, 2020 05:15 IST|Sakshi

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి డీజీపీ సవాంగ్‌ స్పష్టం

సరిహద్దుల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశాకే అనుమతి

రాత్రిపూట అనుమతి లేదని వెల్లడి 

సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని అనుమతించే విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయని డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. డీజీపీ ‘సాక్షి’తో మంగళవారం మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్‌ (అనుమతి) పొందాలని సూచించారు.

పాస్‌ ఉన్న వారిని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. రాష్ట్ర సరిహద్దులోని పోలీస్‌ చెక్‌పోస్టుల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతే అనుమతిస్తారన్నారు. పాస్‌లు ఉన్నప్పటికీ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతించేది లేదన్నారు. రాత్రి వేళల్లో అత్యవసర, నిత్యావసర సర్వీసులకు అనుమతి ఉంటుందన్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని డీజీపీ కోరారు.  

మరిన్ని వార్తలు