సకాలంలో రుణాలు మంజూరు చేయండి

14 May, 2015 05:40 IST|Sakshi

- కలెక్టర్ జానకి

  నెల్లూరు(రెవెన్యూ) : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలకు ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల 20వ తేదీ లోపు రుణాలు మంజూరు చేసేలా  చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.జానకి బ్యాంక్ అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక గోల్డన్ జూబ్లీహాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. చిన్న, మధ్య తరహ పరిశ్రమల స్థాపనకు సహకారం అందించాలన్నారు.

వివిధ రంగాల్లో శిక్షణ పొందిన మహిళా పారిశ్రామికవేత్తల కు రుణాలు మంజూరు చేయాలన్నారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేసిన లబ్ధిదారుల అకౌంట్ నంబర్లు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేయాలన్నారు. ప్రధాన మంత్రి జనధనయోజన ద్వారా బ్యాంక్ అకౌంట్స్ ప్రారంభించిన లబ్ధిదారులందరికీ రూపేకార్డులు అందించాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు రూ.5 వేలు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించాలన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి 20 లీటర్ల నీటని రూ.2కు అందించేందు కు ముందుకు వచ్చిన వారికి రూ.3.5 నుంచి రూ.5 లక్షల వరకు రుణ సదుపాయాం కల్పించాలన్నారు. రికవరీలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ  బ్యాంకర్లు నియమించిన వ్యాపార ప్రతినిధులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారన్నారు.

బ్యాంక్ మిత్రలను వెంకటాచలంలోని శిక్షణ కేంద్రానికి పంపించాలన్నారు. ప్రధాన మంత్రి జనధనయోజన ద్వారా బ్యాంక్ అకౌంట్స్ ప్రారంభించిన లబ్ధిదారులు ఆరు నెలల పాటు లావాదేవీలు కొనసాగించి ఉండాలన్నారు. సిండికేట్ బ్యాంక్ ఆర్‌ఎం శ్రీకృష్ణ, ఆంధ్రాబ్యాంక్ ఆర్‌ఎం సురేంద్రనాథ్, డీఆర్‌డీఎ పీడీ చంద్రమౌళి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు