ప్రేక్షకుల ఆదరాభిమానాలే నంది అవార్డులు

29 Nov, 2017 12:02 IST|Sakshi

హీరోసాయి ధరమ్‌ తేజ్‌

శ్రీవారి క్షేత్రంలో జవాన్‌ చిత్ర యూనిట్‌ సందడి

పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: మెగా ఫ్యామిలీకి ప్రేక్షుకుల ఆధరాభిమానాలే నంది అవార్డులని ప్రముఖ సినీ హీరో సాయిధరమ్‌ తేజ్‌ అన్నారు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని సోమవారం ’జవాన్‌’ చిత్ర యూనిట్‌ సందర్శించింది. హీరో సాయి ధరమ్‌ తేజ్‌తో పాటు హీరోయిన్‌ మెహ్రిన్, దర్శకుడు బీఎస్వీ.రవి, నిర్మాత కృష్ణలు శ్రీవారు, అమ్మవార్లను దర్శించుకున్నారు. అర్చకుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఏఈ వో ఎం.దుర్గారావు హీరోకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం స్థానిక వీఐపీ లాంజ్‌లో సాయి ధరమ్‌ తేజ్‌ విలేకరులతో మాట్లాడారు.

నంది అవార్డులపై మాట్లాడే స్థాయి తనకు లేదంటూనే.. మెగా ఫ్యామిలీకి ప్రేక్షకుల ఆదరణ మెండుగా ఉందని, అవే తమకు అవార్డులన్నారు. జనసేన పార్టీకి ప్రచారం చేస్తారా.. అన్న ప్రశ్నకు బదులిస్తూ, రాజకీయాలతో తనకు సంబంధం లేదన్నారు. జవాన్‌ చిత్రం తన వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉందని, ఒక సామాన్యుడు ఇంటికోసం, దేశం కోసం ఏ విధంగా పోరాడాడన్నది చిత్ర కథాంశమన్నారు. డిసెంబర్‌ 1న విడుదల కానుందని, ప్రేక్షకులు విజయవంతం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. తన తరువాత చిత్రం వీవీ వినాయక్‌ దర్శకత్వంలో చేయనున్నట్టు  తెలిపారు. కిల్‌ పైరసీ అన్నారు. పెద్ద తిరుపతి, చిన తిరుపతి వెంకన్నలంటే తమకు సెంటిమెంట్‌ అని, అందుకే సినిమా రిలీజ్‌కు ముందు ఇక్కడికి వచ్చినట్టు నిర్మాత కృష్ణ తెలిపారు. ప్రతి ఇంటిలోను జవాన్‌ ఉండాలన్నారు.

మా కుటుంబానికి ఇష్టదైవం ఆంజనేయస్వామి
జంగారెడ్డిగూడెం రూరల్‌: అలాగే జవాన్‌ చిత్ర యూనిట్‌ మద్ది గుర్వాయిగూడెం ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. హీరో సాయిధరమ్‌ తేజ్‌ విలేకరులతో మాట్లాడుతూ తమ కుటుంబానికి ఇష్టదైవం ఆంజనేయస్వామి అని, మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకోవడం తనకు ఇది రెండోసారని చెప్పారు. అనంతరం చిత్ర యూనిట్‌తో కలసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

పెదపాడు : స్థానిక రామచంద్ర ఇంజినీరింగ్‌ కళాశాలలో జవాన్‌ చిత్రం యూనిట్‌ మంగళవారం సందడి చేసింది. కళాశాల యాజమాన్యం ఘంటా శ్రీరామచంద్రరావు, ప్రిన్సిపల్‌
డోలా సంజయ్‌ చిత్ర యూనిట్‌కు ఘన స్వాగతం పలికారు. సినిమా ప్రమోషన్‌ కోసం వచ్చిన హీరో సాయిధరమ్‌ తేజ్, హీరోయిన్‌ మెహ్రీన్, చిత్ర యూనిట్‌ సభ్యులు కళాశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. చిత్రం యూనిట్‌ సభ్యులతో విద్యార్థులు సెల్ఫీలు దిగారు.

                         ద్వారకా తిరుమలలో విలేకరులతో మాట్లాడుతున్న జవాన్‌ చిత్ర హీరో సాయి ధరమ్‌ తేజ్, హీరోయిన్‌ మెహ్రిన్‌ తదితరులు

మరిన్ని వార్తలు