వైఎస్సార్సీపీలో పని చేయూలన్నదే నా అభిమతం: ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి
మహానంది (కర్నూలు), న్యూస్లైన్: తనకు జెడ్పీటీసీ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్, ఎంఎల్ఏ పదవులన్నీ మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి వల్లే వచ్చాయని కర్నూలు జిల్లా నందికొట్కూరు శాసనసభ్యుడు లబ్బి వెంకటస్వామి చెప్పారు. మహానందీశ్వరుడి దర్శనార్థం శుక్రవారం మహానందికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను వైఎస్ శిష్యుడినని, రాజకీయ భవిష్యత్తునిచ్చిన ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని అన్నారు. తాను టీడీపీలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. వైఎస్ తనయుడు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీలో పని చేయాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని పాలించిన నాయకులు ఈ ప్రాంతానికి చెందినవారే అయినా సీమాంధ్రకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక ప్రతిపత్తితో రాజధానిని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని కోరారు.