భర్త హత్య కేసులో భార్య సహా కొడుకు అరెస్టు

26 Jun, 2015 02:32 IST|Sakshi

పాతపట్నం : భర్తను హత్య చేశారన్న అభియోగంపై భార్యతోపాటు, కుమారుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. మండలంలోని అచ్చుతపురంలో జరిగిన హత్య కేసుకు సంబంధించి గురువారం ఉదయం నిందితులను విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఐ జె.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ రాత్రి పాతపట్నం మేజర్ పంచాయతీ శివారు అచ్చుతపురం సాయినగర్ కాలనీకి చెందిన రగుతు జీవరత్నం హత్యకు గురయ్యాడన్నారు.
 
  దీనికి సంబంధించి మృతుని భార్య జ్యోతి, కుమారుడు పృథ్వీ పరారులో ఉండగా 24వ తేదీ సాయంత్రం గ్రామ శివారులో పట్టుకున్నామన్నారు. వారిని విచారించగా, ...  తన భర్త రోజూ తాగి ఇంటికి వచ్చి పిల్లలను, తనను కొడుతూంటాడని, అతని వేధింపులను భరించలేక హత్యచేశామని చెప్పారన్నారు.  పశువులకు కట్టిన రెండు నైలాన్ తాళ్లలో ఒకదాన్ని జీవరత్నం కాళ్లకు, రెండో తాడును మెడకు కట్టి కొడుకు సాయంతో గట్టిగా బిగించి హత్యచేసినట్లు నిందితులు తెలిపారని సీఐ వెల్లడించారు. ఈ సందర్భంగా హత్యకు ఉపయోగించిన రెండు నైలాన్ తాళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో హెచ్‌సీ బి.సూర్యనారాయణ, శ్రీనివాసరావు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు