కాపులంతా జగన్‌ వెంటే

21 Jun, 2018 11:46 IST|Sakshi
నైనారు మధుబాల, ఆమె అనుచరులతో భూమన కరుణాకరరెడ్డి 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి

పార్టీలో చేరిన నైనారు కుటుంబం

సాక్షి, తిరుపతి తుడా : కాపులు సీఎం చంద్రబాబునాయుడి మోసాలను గుర్తించారని, అందుకే వారంతా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో ఎన్టీఆర్‌ కుటుంబా నికి అత్యంత ఆప్తులుగా ఉన్న నైనారు కుటుంబానికి చెందిన నైనారు మధుబాల బంధుమిత్రులు, అనుచరులతో కలిసి బుధవారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. భూమన కరుణాకరరెడ్డి నివాసంలో జరి గిన ఈ కార్యక్రమంలో నైనారు మధుబాలకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. కరుణాకరరెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఆయన మాట్లాడుతూ నైనారు కుటుంబంతో తనకు చిన్ననాటి నుంచి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ఆ కుటుంబం పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఓటు బ్యాంకు కోసం గత ఎన్నికల్లో కాపులను వాడుకున్న సీఎం చంద్రబాబు వారిని దారుణంగా మోసం చేశారని దుయ్యబట్టారు. కుల రాజకీయాలతో చంద్రబాబు పార్టీని నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్న సామెతను నిజం చేస్తూ కుల రాజకీయాలే ఆయన్ను ముంచనున్నాయని జోస్యం చెప్పారు. కాపులకు వైఎస్సార్‌ సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. నైనారు మధుబాల మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు.

కాపు నాయకులు దుద్దేల బాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బాలిశెట్టి కిశోర్‌ మాట్లాడుతూ కాపు ఉద్యమానికి జగన్‌మోహన్‌రెడ్డి సంపూర్ణ మద్దతు తెలపడంతో బలిజలు వైఎస్సార్‌ సీపీపై నమ్మకంతో ఉన్నారన్నారు. పార్టీ ఎస్సీ సెల్‌ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు టి.రాజేంద్ర, అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ మానవత్వమే వైఎస్సార్‌సీపీ కులమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కుసుమకుమారి, బొమ్మగుంట రవి, బండ్ల లక్ష్మీపతి పాడి శివప్రసాద్‌ యాదవ్, పుల్లయ్య, రాధామాధవి, శైలజ, లక్ష్మీరెడ్డి, వాసుయాదవ్, కేతం జయచంద్రారెడ్డి, గీతా యాదవ్, సాయికుమారి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు