మరోసారి బయటపడ్డ టీడీపీ కుట్ర: నాని

28 Jul, 2018 19:28 IST|Sakshi
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని

సాక్షి, గుడివాడ(కృష్ణా జిల్లా): తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలు మరోసారి బహిరంగంగా బట్టబయలయ్యాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుడివాడ మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ పదవి దక్కించుకోవాలనుకున్న అధికారి పార్టీ కుటిల యత్నాలు విఫలమయ్యాయని ఎమ్మెల్యే విమర్శించారు. వైస్‌ చైర్మన్‌ పదవి కోసం టీడీపీ తవ్వుకున్న గోతిలో ఆపార్టీయే పడిందని వ్యాఖ్యానించారు. 

వైఎస్సార్‌ సీపీకి చెందిన 12 మంది కౌన్సిలర్లను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బలం పెరిగిందనుకొని వైస్‌ చైర్మన్‌పై అవిశ్వాసం ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. శనివారం అవిశ్వాసంపై చర్చ జరగాల్సివుండగా ఇద్దరు కౌన్సిలర్లు కనిపించడం లేదని కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అవిశ్వాసంపై చర్చలో టీడీపీని  ఫిరాయింపులపై ఎండగట్టాలని అనుకున్నామని వివరించారు. అవిశ్వాసంపై చర్చ జరిగితే టీడీపీలోని గ్రూపులు బయటపడతాయనే ఉద్దేశంతో ఈ డ్రామాలు ఆడుతున్నారని కొడాలి నాని ఆరోపించారు.  

 

మరిన్ని వార్తలు