ఆంధ్రా ఆక్టోపస్ కాదు... ఇది ఎల్లో జలగ!

18 May, 2019 21:08 IST|Sakshi

ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి విమర్శ

సాక్షి, హైదరాబాద్‌: చంద్రబాబు స్కెచ్‌లో భాగమే లగడపాటి రాజగోపాల్‌ శనివారం సాయంత్రం ప్రకటించిన సర్వే అని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘చంద్రబాబు స్కెచ్‌లో భాగమే లగడపాటి రాజగోపాల్‌ సర్వే. 23న కౌంటింగ్‌ ప్రారంభం కాగానే బాబు ఏమంటాడంటే.. గెలుస్తామని లగడపాటి చెప్పాడు. అయినా ఓడుతున్నామంటే అందుకు ఈవీఎం ట్యాంపరింగే కారణం అని చెప్పేందుకే ఈ గోల. లగడపాటి ఆంధ్రా ఆక్టోపస్‌ కాదు.. ఎల్లో జలగ!’ అని శనివారం ట్వీట్‌ చేశారు. ‘లగడపాటి గారూ.. మీ పేరును నారా రాజగోపాల్‌గా మార్చుకోండి’ అని కూడా విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా సూచించారు. 

బాబుకు మీడియా ‘నయీం’ బ్లాక్‌మెయిల్‌
తనను రక్షించకపోతే చంద్రబాబు రహస్యాలన్నీ బయట పెడతానని మీడియా ‘నయీం’ రవిప్రకాష్‌ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడంటూ విజయసాయిరెడ్డి శనివారం మరో ట్వీట్‌ చేశారు. ‘ఏదో ఒకటి చేసి రక్షించకపోతే చంద్రబాబు రహస్యాలన్నీ బయటపెడతానని బ్లాక్‌మెయిల్‌కు దిగాడట మీడియా ‘నయీం’. 23 తర్వాత తన పరిస్థితి ఏమిటో అంతుబట్టక చంద్రబాబు సతమతమవుతుంటే ఇతను, శివాజీ, దాకవరపు అశోక్, హర్షవర్ధన్‌ చౌదరిల బెదిరింపులతో చంద్రబాబు కుంగిపోతున్నాడట. వీళ్లంతా ఇంత ఈజీగా దొరికిపోయారేంటని మొత్తుకుంటున్నాడట’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 
రీ పోలింగ్‌ అంటే ఎందుకు వణికిపోతున్నారు
‘చంద్రగిరిలో 7 పోలింగ్‌ బూత్‌లలో రీ పోలింగ్‌ అంటేనే ఇంతగా వణికిపోతున్నారేంటి చంద్రబాబూ.. ఈసీపై దాడికి పురమాయించేంత తప్పేం జరిగిందని? ఏ పార్టీ ఓటర్లు ఆ పార్టీకి ఓటేస్తారు. ఓడిపోయినట్లు గంగవెర్రులెందుకు? పాతికేళ్లుగా దళితులను ఓటు హక్కుకు దూరం చేసిన మీ నిజ స్వరూపం బయటపడినందుకా?’ అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌ చేశారు.  

మరిన్ని వార్తలు