కబ్జా భూములను స్వాధీనం చేసుకోండి

23 May, 2015 05:44 IST|Sakshi

చిత్తూరు (అగ్రికల్చర్): గంగాధరనెల్లూరు మండలంలో కబ్జా భూములను స్వాధీనం చేసుకోవాలని డీఆర్‌ఓ విజయచందర్‌ను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి కోరారు.  శుక్ర వారం కలెక్టరేట్‌లోని డీఆర్‌ఓ కార్యాలయంలో డీఆర్‌ఓను కలిసి ఈమేరకు నారాయణస్వామి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంగాధరనెల్లూరు మండలం నందళూరు రెవెన్యూ పరిధిలోని దాదాపు 16 ఎకరాల డీకేటీ భూములను పాపిరెడ్డిపల్లెకి చెందిన సుధాకర్‌రెడ్డి ఆక్రమించుకుని సాగు చేయకుండా వృథాగా వదలి వేసి ఉన్నారని తెలిపారు.

పెడకంటిపల్లి దళిత వాడకు చెందిన ప్రజలు ఏళ్లతరబడి ఇళ్ల స్థలాలులేక పక్కా గృహాలకు నోచుకోలేదన్నారు.  కబ్జా భూములను స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని ఆయన కోరారు. దీనిపై పలుమార్లు వినతులు చేసినా మండల స్థాయి అధికారులు ఏమాత్రం స్పందిం చడం లేదని, గతంలో చిత్తూరు ఆర్‌డీఓకు కూడా వినతి చేశాసినా ఫలితం కనిపించలేదని చెప్పారు. కనీసం కబ్జా భూములను సర్వే చేయడంలో కూడా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. మీరైనా దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకుని కబ్జా భూములను స్వాధీనం చేసుకోవాలని డీఆర్‌వోను నారాయణ స్వామి కోరారు.

మరిన్ని వార్తలు