శ్రీశైలంలో చిరుతల సంచారం

27 Apr, 2020 11:29 IST|Sakshi
హఠకేశ్వరం పరిసరాల్లో సంచరిస్తున్న రెండు చిరుతలు

శ్రీశైలం: శ్రీశైలం క్షేత్ర పరిధిలోని సాక్షిగణపతి, హఠకేశ్వరం రోడ్డు మార్గంలో రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. దీంతో దేవస్థానం మైకుల ద్వారా స్థానికులకు తగు జాగ్రత్తలు సూచిస్తున్నారు. లాక్‌డౌన్‌ వల్ల  శ్రీశైలానికి ఎలాంటి రాకపోకలూ లేవు. సున్నిపెంట– శ్రీశైలం మధ్య కూడా రాకపోకలపై నిషేధం ఉంది. అయితే.. సాక్షి గణపతి, హఠకేశ్వరం, చెక్‌పోస్ట్‌ తదితర ప్రదేశాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది శనివారం రాత్రి చిరుతల సంచారం గురించి తెలియజేశారు. దీంతో దేవస్థానం అధికారులు మైకుల ద్వారా స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. సాధారణంగా వేసవిలో చిరుతలతో పాటు ఇతర వన్యప్రాణులు నీటి కోసం రహదారులను దాటుకుని వెళ్తుంటాయి. లాక్‌డౌన్‌   సందర్భంగా వాహన రాకపోకలు, జనసంచారం లేకపోవడంతో చిరుతలు, జింకలు, అడవి పందులు వంటి వన్యప్రాణులు ఘాట్‌రోడ్లపై కనిపిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు