విశాఖ సిటీ: స్వల్ప ఓట్లు రాజకీయ నాయకుల జీవితాల్నే మార్చేస్తాయి. 1989 ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానానికి పోటీపడిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ (2,99,109) టీడీపీకి చెందిన సమీప ప్రత్యర్థి అప్పల నరసింహ (2,99,100)పై కేవలం 9 ఓట్ల తేడాతో విజయం సాధించారు. చోడవరం నుంచి కరణం ధర్మశ్రీ రెండుసార్లు స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మశ్రీ 1,267 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజుపై, 2014లో వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసిన ధర్మశ్రీ మళ్లీ అదే అభ్యర్థి చేతిలో 905 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
పోస్టల్ బ్యాలెట్తో తారుమారు
2009లో పీఆర్పీ అభ్యర్థి కోలా గురువులు గెలుపు ఖాయమై సంబరాలు చేసుకుంటున్న తరుణంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆయన ఆశలపై నీళ్లు చల్లాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్ 341 ఓట్లతో గెలుపొందారు. ద్రోణంరాజు శ్రీనివాస్కు 45,971 ఓట్లు రాగా, గురువులకు 45,630 ఓట్లు వచ్చాయి.