'మహిళా సంక్షేమమే మా తొలి ప్రాధాన్యత'

29 Oct, 2019 12:20 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖ తగరపువలస జూట్‌ మిల్స్‌ గ్రౌండ్‌లో మహిళా సంఘాలకు రుణ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌, విఎంఆర్డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌, జీవీఎంసీ కమిషనర్‌ జి. సృజన తదితరులు హాజరయ్యారు. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పది సంవత్సరాల పోరాటం తర్వాత వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన అయిదు నెలల కాలంలోనే మేనిఫెస్టోలోని 80శాతం హామీలను నెరవేర్చామని వెల్లడించారు.

అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే అన్ని వర్గాలకు మేలు చేసే 20 బిల్లులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దేశంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50శాతం మేర రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా రైతలకు అండగా నిలబడుతున్నామని తలిపారు. కృష్ణా ,గోదావరి నదీ జలాల వినియోగంపై ఇతర రాష్ట్రాలతో సఖ్యతగా మెలుగుతూనే పరిష్కార మార్గాలకు ప్రత్యేక ప్రణాళిక నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఆదాయ వనరులిచ్చే మద్యాన్ని ఏ రాష్ట్రం వదులుకోదు, కానీ మా ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం రాష్ట్రాన్ని సంపూర్ణ మద్య నిషేదం రాష్ట్రంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే తొలిదశలో బెల్టు షాపుల నియంత్రణకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ అయిదేళ్ల పాలనలో పేదలకు 25 లక్షల ఇళ్లను ఇవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు. 

విశాఖను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఎంపీ విజయసాయిరెడ్డి నిరంతరం కష్టపడుతున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. ప్రజాతీర్పును సహించలేకే టీడీపీ నేతలు బురద జల్లుతున్నారని విమర్శించారు. లోకేష్‌ రాజకీయ జీవితం ముగిసిపోయందన్న ఉక్రోశంలో చంద్రబాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అమర్‌నాథ్‌ దుయ్యబట్టారు. నవరత్నాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. విశాఖ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తమ వంతు ప్రయత్నం కొనసాగిస్తామని వీఎంఆర్డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ తెలిపారు. 

సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం
విశాఖపట్నంలోని మధురవాడలో ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల ఇంగ్లీషు మీడియం స్కూల్ లో రాష్ట్ర స్దాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ సిఎం పాముల పుష్పశ్రీ వాణి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను లాంచనంగా ప్రారంభించారు . కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి బాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు