21న గుంటూరులో మిలియన్‌ మార్చ్‌

13 Jul, 2018 13:28 IST|Sakshi
మిలియన్‌ మార్చ్‌ను జయప్రదం చేయాలని పిలుపునిస్తున్న దళిత నేతలు  

నాగార్జున యూనివర్సిటీ నుంచి మంగళగిరి వరకు లక్షమందితో ప్రదర్శన

దళిత ఉద్యమనేత ఉదయ్‌భాస్కర్‌

వేపాడ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిరక్షణకు ఈ నెల 21న రాష్ట్ర రాజధాని గుంటూరులో నిర్వహించే మిలియన్‌ మార్చ్‌ను జయప్రదం చేయాలని పూలే అంబేద్కర్‌ విజ్ఞాన కేంద్రం జిల్లా కన్వీనర్‌ ఆతవ ఉదయ్‌భాస్కర్‌ పిలుపునిచ్చారు. స్థానిక విలేకరులతో ఆయన గురువారం మాట్లాడారు. మార్చి 20న సుప్రీంకోర్టు  తీర్పు దళిత ఆదీవాసీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా  ఉందని,  దీనిపై పాలక ప్రతిపక్షాలు మాట్లాడకపోవడం బాధాకరమన్నారు.

భారత్‌ బంద్‌లో 11 మంది దళిత యువకులు చనిపోయారని, ఇది కేంద్రంలోని కాషాయ పాలకులకు కనిపించకపోవడం విచారకరమన్నారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ నుంచి మంగళగిరి వరకు నిర్వహించే మిలియన్‌మార్చ్‌కు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దళిత నేతలు కెర్రి దేముడు, డప్పురాజు, ఎ.నాగరాజు, సీహెచ్‌ నూకరాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు