సుగుణకే ఎమ్మెల్యే టికెట్

19 Dec, 2014 03:15 IST|Sakshi
సుగుణకే ఎమ్మెల్యే టికెట్

తిరుపతి కార్పొరేషన్: తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటరమణ సతీమణి సుగుణను ఖరారు చేసినట్టు తెలిసింది. దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో మృతి చెందడంతో తిరుపతికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఆయన స్థానంలో ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇస్తారనే అంశంపై రెండు రోజులుగా నగరంలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడితో సన్నిహిత సంబంధాలు ఉన్న టీడీపీలోని కొందరు నాయకులు వెంకటరమణ వారసులం తామేనని, టికెట్ తమకే వస్తుందని ఎవరికి వారే తమ అనుచరుల ద్వారా ప్రచారాలు చేసుకుంటున్నారు.

ఈనేపథ్యంలో ఊహాగానాలకు తెరదించుతూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసిన జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు తిరుపతి టికెట్ అంశంపై చర్చించినట్టు తెలిసింది. దీంతో ఆయన స్పందిస్తూ తిరుపతిపై తాను ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వెంకటరమణ సతీమణి సుగుణకే టికెట్ ఇవ్వనున్నట్టు మనసులో మాటను చెప్పారని తెలిసింది.

ఆమెను అభ్యర్థిగా ప్రకటించడం వల్ల ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్న సంకేతాలు ఇవ్వవచ్చని అభిప్రాయడ్డారని తెలిసింది. అంతేగాకుండా సుగుణకు టికెట్ ఇవ్వడం వల్లఇతర పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి దింపకపోవచ్చని.. తద్వారా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

మరిన్ని వార్తలు