అనుసంధానంతో రైతన్నకు ఉపశమనం

26 Jul, 2017 02:01 IST|Sakshi
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి
 
సాక్షి, న్యూఢిల్లీ: నదుల అనుసంధానం ద్వారా రైతన్నకు ఉపశమనం కలుగుతుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాజ్యసభలో వ్యవసాయ సంక్షోభంపై స్వల్పకాలిక చర్చలో మాట్లాడుతూ.. ‘‘ప్రతి సెషన్‌లో ఏదో ఒక రూపంలో ఈ అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. సభ్యులు సూచనలు చేస్తూనే ఉన్నారు. కానీ వాటి అమలులో జాప్యం జరుగుతోంది. రైతుల మానసిక క్షోభ అలాగే ఉండిపోతోంది. ఈ ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించే దిశగా పయనిస్తోంది.

రైతుల సంక్షేమం పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. అయితే ఇవన్నీ చేసినా ఏటా 12 వేలమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి నేను కొన్ని సూచనలు చేయదలుచుకున్నా. ముఖ్యంగా బ్యాంకు రుణాల పంపిణీ చిన్న, సన్నకారు, కౌలు రైతులకు సక్రమంగా అందట్లేదు. ఎరువులు, పురుగు మందులు తదితర ఉత్పాదితాలకోసం అప్పు తేవడం తప్పనిసరవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే గతంలో వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు పావలా వడ్డీకే రుణాలిచ్చేలా చేశారు. విస్తృతమైన అవగాహన కల్పించగలిగారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రుణాలందేలా పట్టణ ప్రజల భాగస్వామ్యంతో ఒక నిధిని ఏర్పాటు చేసి వారికి సాయమందేలా చూడాలి’’ అని ఆయన సూచించారు.
మరిన్ని వార్తలు