ప్రయాణికులూ..జరజాగ్రత్త

20 Mar, 2018 11:57 IST|Sakshi
గంగాపురం వద్ద కుంగిన కల్వర్టు

కొండాపురం: మండలంలోని గంగాపురం వద్ద జాతీయ రహదారిపై కల్వర్టు సోమవారం కుంగిపోయింది. దీంతో ప్రయాణికులకు ఏ మూల నుంచి ముప్పు వస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. గండికోట ప్రాజెక్టు కింద తాళ్లప్రొద్దుటూరు నుంచి మంగపట్నం  గ్రామాల వరకు సూమారు 28 కిలోమీటర్లు జాతీయ రహదారి ముంపులోకి గురైంది. గండికోట ప్రాజెక్టులో 8.7 టీఎంసీల నీరు నిల్వ ఉన్న సమయంలో  ఈ పాత రహదారి పూర్తిగా కృష్ణజలాలతో మునిగిపోయింది.  ప్రత్యామ్నయంగా కె.సుగుమంచిపల్లె నుంచి శెట్టివారిపల్లె వరకు  రూ.101. 35 కోట్లతో జాతీయరహదారిని  ఏర్పాటు చేశారు. నీళ్లు ఉన్న సమయంలో కొత్త బైపాస్‌లో వాహనాలను అధికారులు మళ్లించారు.

ఇటీవల గండికోట ప్రాజెక్టులో నీరు తగ్గడంతో పాత రూటులోనే అధికారులు వాహనాలను మళ్లించారు. ఈనేపథ్యంలో భయంతో ప్రయానం చేయాల్సి వస్తోందని ప్రయాణీకులు వాపోతున్నారు. కె.సుగుమంచిపల్లె సమీపంలో అడుగు అడుగున గుంతలు పడినా ప్యాచింగ్‌ పనులు చేయలేదని వాహనదారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.   పాత చౌటిపల్లె సమీపంలో చిత్రావతి వంతెన ఆరంభంలో బ్రిడ్జి కుంగింది. ఏ మూల నుంచి ప్రమాదం వాటిల్లుతుందోనని ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. వెంటనే ఉన్నతాదికారులు చొరవ చూపి ప్రమాదాలు జరగకుండా కొత్త బైపాస్‌ రోడ్డులో వాహనాలను మళ్లించాలని వాహనదారులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు