ఎమ్మెల్యే పల్లా.. కబ్జా లీల

28 Jan, 2019 07:06 IST|Sakshi
కొత్త గాజువాక జంక్షన్‌ మెయిన్‌ రోడ్‌లో ఆక్రమిత స్థలంలో కొనసాగుతున్న తాత్కాలిక దుకాణాలు

సర్కార్‌ భూములపై కన్ను

ఆయన బాటలోనే అనుచర గణం

పక్కా స్కెచ్‌తో ఆక్రమణలు

నోరుమెదపని అధికారులు

ఎన్నికల్లో గెలిపిస్తే గాజువాకనియోజక వర్గాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్తానని ఇచ్చినహామీలను పక్కనపెట్టి భూఅక్రమాల్లో దూసుకుపోతున్నారుఅధికార పార్టీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు.మీకు మేము తక్కువ కాదంటూ అతనిఅనుచరులు ఎమ్మెల్యే చూపిన దారిలోఅక్రమాల బాట పట్టారు.రూ.కోట్ల విలువైన భూములనుపక్కా స్కెచ్‌తో అక్రమించి కలిసికొల్లగొట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటేఅధికారాన్ని అడ్డుపెట్టుకునిఅందినంత దోచుకున్నారు.

విశాఖపట్నం, గాజువాక: గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కన్ను సర్కారు భూములపై పడింది. పదవిని అడ్డుపెట్టుకొని ఖరీదైన భూములను కబ్జా చేయడం, వివాదాస్పద భూములను రెగ్యులరైజ్‌ చేసుకోవడం, దారిలేని భూములకు అభివృద్ధి పనుల మాటున రహదారి వేసుకుని దందా సాగిస్తున్నారు. ఈయన అక్రమాలపై అధికారులకు ఫిర్యాదులొచ్చినా, ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నా.. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఆక్రమణలపై చర్య తీసుకోవడానికి అధికారులు వెనకడుగు వేస్తున్నారు.

వెయ్యి గజాలు దురాక్రమణ : గాజువాక పట్టణానికి నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ స్థలాన్నిఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బంధువులు ఆక్రమించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వెయ్యి గజాల స్థలంలో తాత్కాలిక దుకాణాలను నిర్మించి అద్దెలకు ఇచ్చారు. కొత్తగాజువాక జంక్షన్‌లో మెయిన్‌ రోడ్డుకు, హైస్కూల్‌ రోడ్డుకు కార్నర్‌లో ఉన్న ఈ భూమి ధర అక్షరాలా రూ.20 కోట్లు. ప్రస్తుతం ఇక్కడ బహిరంగ మార్కెట్‌ విలువ ప్రకారం చదరపు గజం ధర రూ.2లక్షలు పలుకుతోంది. ఈ విలువైన స్థలంపై కన్నేసిన పల్లా కుటుంబం అధికారం చేతిలోకి రాగానే దాన్ని ఆక్రమించి జీవో 301 ప్రకారం క్రమబద్ధీకరణ కూడా చేసేసుకున్నారు.

20 ఏళ్ల కిందటే  కన్ను
గాజువాక సర్వే నంబర్‌ 87లో ఉన్న ఈ భూమిపై ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం, అతడి సమీప కుటుంబ సభ్యులు 20 ఏళ్ల కిందటే కన్నేశారు. అందులో నిర్మాణానికి ఉపక్రమించడంతో అప్పటి రెవెన్యూ అధికారులు అడ్డుకొన్నారు. అప్పటికే గాజువాక భూములపై 1995లో అప్పటి ముఖ్య మంత్రి ఎన్‌.టి.రామారావు హౌస్‌ కమిటీ ఏర్పాటు చేయడంతో ఈ విషయం కమిటీ దృష్టికి వెళ్లింది. దీనిపై విచారణకు రావాల్సిందిగా కమిటీ చైర్మన్‌ అప్పట్లో పల్లా కుటుంబాన్ని ఆదేశించారు. సింహాచలంతోపాటు అతడి ఇద్దరు సోదరులు తాము ఆ స్థలాన్ని ఒక్కొక్కరు 330 చదరపు గజాల చొప్పున కొనుగోలు చేసినట్టు డాక్యుమెంట్లను కమిటీ చైర్మన్‌కు చూపించారు. డాక్యుమెంట్లను పరిశీలించిన హౌస్‌ కమిటీ డాక్యుమెంట్లలో సర్వే నంబర్‌కు, స్థలానికి ఎలాంటి సంబంధం లేదంటూ పల్లా కుటుంబ సభ్యుల వాదనను కొట్టేసింది. ఆ భూమిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా అప్పటి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్‌ కూడా వేశారు.

హైకోర్టులో చుక్కెదురైనా..
ఆక్రమిత భూమి వ్యవహారంలో వ్యతిరేకంగా నిర్ణ యం రావడంతో  హైకోర్టుకు వెళ్లిన పల్లా కుటుం బ సభ్యులు హైకోర్టు ఆశ్రయించారు. అక్కడ కూడా చుక్కెదురైంది. 2014లో  పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆ స్థలంపై మళ్లీ పావులు కదిపారు. స్థానిక రెవెన్యూ అధికా రుల అండతో స్థలాన్ని కబ్జా చేసి తాత్కాలిక దుకా ణాలు నిర్మించారు. గాజువాక హౌస్‌ కమిటీ భూ ముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 301 ప్రకారం సంబంధిత వెయ్యి గజాల స్థలానికి క్రమబద్ధీకరణ పట్టాలను తీసుకున్నారు.

నిర్వాసితులకు స్థలాల వెనుకఅసలు కథ ఇదేనా?
దారీతెన్నూలేని తన భూమికి రహదారి వేసుకోవడం కోసం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఏపీఐఐసీ నిర్వాసితుల స్థలాల సమస్యను తెరపైకి తెచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గాజువాక మండలం గొల్లజగ్గరాజుపేటలో ఎమ్మెల్యే కుటుంబానికి సుమారు 25 ఎకరాల భూమి ఉంది. అందులో 7.5 ఎకరాలను గతంలోనే విక్రయించగా, మరికొంత భూమి ఓ కార్పొరేట్‌ సంస్థకు లీజుకిచ్చినట్టు సమాచారం. ఇంకా మిగిలి ఉన్న భూమికి రహదారి సౌకర్యం లేకపోవడంతో దానివైపు ఎవరూ చూడటం లేదు. ఈ నేపథ్యంలోనే నాలుగు గ్రామాల ఏపీఐఐసీ నిర్వాసితులకు కేటాయించాల్సిన ఇళ్ల స్థలాల సమస్యను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెరపైకి తెచ్చినట్టు చెబుతున్నారు. ఫకీర్‌తక్యా, వడ్లపూడి, గొల్లజగ్గరాజుపేట, తుంగ్లాం గ్రామాలకు చెందిన ఏపీఐఐసీ నిర్వాసితులకు ఇళ్ల స్థలాల కోసం గతంలో ఐదెకరాల భూమిని కేటాయించారు. అప్పటికి 550 మంది ఉన్న నిర్వాసితుల సంఖ్యను ఇప్పుడు 750కి పెంచి ప్రభుత్వం నుంచి అదనంగా పదెకరాల స్థలాన్ని కేటాయించే విధంగా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడు ఆ 15 ఎకరాల్లో లే అవుట్‌ వేసి నిర్వాసితులకు ఇళ్ల స్థలాలను ఇస్తే తన భూమికి రహదారి వేసుకోవచ్చునని భావించిన పల్లా ఆగమేఘాలపై ఆ పని మొదలు పెట్టించారు. తన అభివృద్ధి నిధుల నుంచి రూ.40 లక్షలు మంజూరు చేసి లే అవుట్‌ పనులకు ఇటీవల శంకుస్థాపన కూడా చేశారు. తద్వారా  తన భూమికి రహదారి ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమం చేసుకున్నారు.

బినామీతో 42 సెంట్ల ప్రభుత్వభూమి హాంఫట్‌
దువ్వాడలో మూడున్నర కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమికి ఎమ్మెల్యే బినామీలు రికార్డులు మార్చేసి కబ్జా చేశారు. ఆ భూమి తనదంటూ కోర్టుకెక్కిన ఓ వ్యక్తి నుంచి భూమిని కాపాడుకున్న రెవెన్యూ అధికారులే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధికి పల్లెంలో పెట్టి అప్పగించారు. ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉన్న వ్యక్తి పేరుతో దాన్ని కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్‌ కూడా జరిపోయింది. ఆ భూమిపై తమకు కూడా హక్కులున్నాయంటూ స్థానికంగా ఉన్న ఓ సొసైటీ ప్రతినిధులు కూడా కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం నడుస్తుండగానే అందులో షెడ్లు నిర్మించడంతో విషయం వెలుగు చూసింది.

గాజువాక మండలం కూర్మన్నపాలెం సర్వే నంబర్‌ 8/6లో 1.35 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమి తనదంటూ గతంలో ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. తనకు అసైన్‌మెంట్‌ పట్టా ఉందని వాదించాడు. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు ఆ పట్టాను ఏనాడో రద్దు చేశామని కోర్టుకు వివరిస్తూ అది ప్రభుత్వ భూమేనని స్పష్టం చేశారు. దీంతో ఆ భూమిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా రెవెన్యూ అధికారులకు హైకోర్టు సూచించింది. అప్పట్నుంచీ అధికారులు తమ పర్యవేక్షణతో దాన్ని కాపాడుతూ వచ్చారు. ఈ క్రమంలో అదే వ్యక్తి గాజువాకలోని అధికార పార్టీకి చెందిన కీలకనేతను ఆశ్రయించాడు. దీంతో ఆ స్థలాన్ని అప్పనంగా కొట్టేద్దామని స్కెచ్‌ వేసిన సదరు నేత రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురి చేశాడు. 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిలో 42 సెంట్ల భూమిని కోర్టుకెక్కిన వ్యక్తి పేరుమీద మార్చేసి సర్వే నంబర్‌ 8/6బి పేరుతో ఆన్‌లైన్‌లో కూడా పెట్టేశారు. దీంతో సదరు వ్యక్తి తమకు అమ్ముతున్నట్టు స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు గాంధీ పేరుమీద సేల్‌ ఎగ్రిమెంట్‌ను కూడా రాయించుకున్నారు. ఇక రిజిస్ట్రేషనే తరువాయి అనుకున్న సమయంలో స్థానిక సొసైటీ ప్రతినిధులు అడ్డు తగలడంతో ఆగిపోయింది. అయినప్పటికీ అధికార బలాన్ని ఉపయోగించి అగ్రిమెంట్‌ రాసి ఇచ్చిన వ్యక్తితోనే అందులో షెడ్ల వేయించి  స్థలాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు