శ్రీకారం చుట్టుకుంది సంక్షేమ శకం

31 May, 2019 11:50 IST|Sakshi

పెన్షన్ల పెంపుపై సీఎం వైఎస్‌జగన్‌ తొలి చేవ్రాలు

రూ.3 వేల దిశగా తొలి అడుగు

గ్రామ సురాజ్యం దిశగా మలి నిర్ణయం

సంక్షేమ శకం శ్రీకారం చుట్టుకుంది. రాజన్న రాజ్యం దిశగా తొలి అడుగులు పడ్డాయి. ప్రతి కుటుంబంలో వెలుగులు నింపేందుకు నవరత్నాలు నడుచుకుంటూ వస్తున్నాయి.అఖండ మెజారిటీతో  అధికారంలోకి వచ్చిన జననేత వై.ఎస్‌.జగన్‌ నవ్యాంధ్ర సీఎంగా పట్టాభిషేకంతోనే విప్లవాత్మక నిర్ణయాలతో పాలనపై ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. ఇంతకుముందే ప్రకటించిన నవరాత్నాల్లో తొలి రెండింటిని ప్రజలకు అందించే దిశగా తొలి అడుగులు వేశారు. సామాజిక పెన్షన్లను రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు పెంచుకుంటూ పోతామన్న  హామీ అమల్లో తొలి దశగా రూ2250కి పెంచుతూ తొలి ఫైలుపై చేవ్రాలు చేసి.. పెన్షనర్లను మురిపించారు. ఈ నిర్ణయం ఫలితంగా విశాఖ జిల్లాలోని పెన్షనర్లకు రూ.16.76 కోట్ల మేరకు ప్రతి నెలా అదనపు లబ్ధి చేకూరుతుంది.

ఇక గ్రామాల్లో అవినీతి రహిత పాలన.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న రెండు లక్ష్యాల సాధనకు వీలుగా గ్రామ సురాజ్యానికి బాటలు వేస్తున్నారు. ఆగస్టు 15 నాటికి ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీరు  నియామకం.. అక్టోబర్‌ 2 నాటికి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి.. ఒక్కో దాంట్లో పది మందికి ఉద్యోగం ఇవ్వడం ద్వారా.. జిల్లాలో 38,321 మందికి ఉపాధి లభిస్తుంది.తొలి అడుగులోనే లక్షలాది మందికి మేలు చేసే నిర్ణయాలు తీసుకున్న సీఎం వైఎస్‌జగన్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

సాక్షి, విశాఖపట్నం : ‘ప్రతి అవ్వకు.. ప్రతి తాతకు..’ అంటూ సభల్లో భరోసానిచ్చే జననేత మాట నిలబెట్టుకున్నారు. ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను..’అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వైఎస్సార్‌ పింఛన్‌ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. జనహితమే తన నినాదమనడంతో పల్లెలు పండుగు చేసుకుంటున్నాయి. ప్రజారంజకమైన పాలన ప్రారంభమైంది.  
రాజన్న రాజ్యం వచ్చింది. సంక్షేమ రాజ్యం మొదలైంది. రాజన్న ముద్దుబిడ్డ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నవరత్నాల అమలుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రజల దిశదశను మారుస్తాయని బలంగా విశ్వసించే నవరత్నాల్లో ఒకటైన పెన్షన్ల పెంపు ఫైల్‌పై జనహృదయ నేత ముఖ్యమంత్రిగా తన తొలి సంతకాన్ని చేశారు. అధికారంలోకి రాగానే పెన్షన్‌ను రూ.3 వేల వరకు పెంచుకుంటూ పోతానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తొలి అడుగు వేశారు. ప్రస్తుతం రూ.2వేలు ఇస్తున్న పెన్షన్‌ను జూలై 1వ తేదీ నుంచి రూ.2250 పంపిణీ చేయనున్నారు.   

నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ప్రస్తుతం ఇస్తున్న రూ.1000 పింఛన్‌ మొత్తాన్ని రూ.2వేలకు పెంచుతామని 2017లో జరిగిన పార్టీ ప్లీనరీలో  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. జగన్‌ రూ. రెండు వేలు పెంచుతామని చెప్పడంతో చంద్రబాబు రూ.2 వేలు పెంచుతూ ప్రకటన చేశాడు. ఫిబ్రవరి నుంచి అమలులోకి తీసుకొచ్చారు.అయినా ఆ అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు చంద్రబాబు మాటను విశ్వసించలేదు. జననేతకు జై కొట్టారు. అఖండ మెజార్టీతో గెలిపించి సీఎం చేసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం పెన్షన్‌ పెంపుపై చేయడంతో అంతా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది రూ.250 పెంచుతున్నట్టు ప్రకటించారు. అదే విధంగా రెండో ఏడాది రూ.500, మూడో ఏటా రూ.750, నాల్గో ఏడాది రూ.3వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.  ప్రస్తుతం 80 శాతం వికలత్వం ఉన్న దివ్యాంగులకు మాత్రమే రూ.3వేల చొప్పున పెన్షన్‌ ఇస్తున్నారు. మిగిలిన వారందరికి రూ.2వేల చొప్పున పెన్షన్‌ ఇస్తున్నారు. దీంతో మిగిలిన వారందరూ  జూలై 1వ తేదీ నుంచి రూ.2250 చొప్పున పెన్షన్‌ పొందనున్నారు. దీంతో జిల్లాలో 4,19,236 మంది లబ్ధిపొందనున్నారు. ఈ విధంగా సామాజిక పెన్షన్‌ దారులకు అదనంగా రూ.16.76 కోట్ల మేర లబ్ధి కలుగనుంది.

ఎంతో ఆసరా
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తన హామీని వెంటనే నిలుపుకున్నారు. వృద్ధాప్య పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.2250కు పెంచారు. ఇది ఎంతో  ఆనందంగా ఉంది. తనలాంటి వారికి మరింత ఆసరాగా నిలవనుంది.– మొల్లి సత్యవమ్మ, కశింకోట

అవ్వాతాతలంటే అభిమానం
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే అవ్వాతాతలను గుర్తుపెట్టుకొని పింఛన్‌ పెంచడం చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన హామీలను వాయిదా వేయకుండా, పదవిలోకి వచ్చిన తొలిరోజే అమలు చేయడం చాలా గొప్ప విషయం. వచ్చే నెల నుంచి రూ.2250లు చేతికి రానున్నాయి. నా మందులకు, ఇతర ఖర్చులకు పనికివస్తాయి.– ఆళ్ల సూర్యకాంతం, జగన్నాథపురం, అక్కయ్యపాలెం

తండ్రిని తలపించాడు
ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వృద్ధులకు ఎంతో మేలు చేశారు. ఈ రోజు అతని బిడ్డ ముఖ్యమంత్రిగా వచ్చి మాలాంటి వాళ్లకు మరింత ఆసరా కల్పించారు. నెలకు రూ.2,250 పింఛన్‌ ఇవ్వడం మాకు వరమే. ఆ మహానుభావుడు పదికాలలపాటు చల్లగా ఉండాలి.– జెట్టి సన్యాసమ్మ, సబ్బవరం

ఆయన మాటల్లో నిజాయతీ ఉంది
ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి పింఛను పెంచుతున్నట్టు జగన్‌మోహన్‌రెడ్డి ముఖమంత్రిగా  ప్రమాణ స్వీకారం అనంతరం సంతకం చేయడం ఎంతో అభినందనీయం. పింఛను పెంచి మాట నిలబెట్టుకున్నారు. ప్రతి ఏడాది పింఛను పెంచుతామని చెప్పడంలో నిజాయతీ కనిపించింది.–కంటి.లక్ష్మి. రాజన్నపేట, రోలుగుంట

ఇచ్చిన మాట ప్రకారం..
పింఛన్లను రూ.3వేల వరకు పెంచుతామని ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి సంతకం చేయడం అభినందనీయం. పింఛన్‌దారులంతా జగనన్నకు రుణపడివుంటారు. జూన్‌ నుంచి రూ.2250 మేరకు పింఛన్ల పెంపు సంతోషదాయకం.– పి.జయమ్మ, గృహిణి, పెదవాల్తేరు

మరిన్ని వార్తలు