అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తానన్న ప్రతిపక్ష నేత
వెల్లువెత్తిన వినతులు
ప్రజా సంకల్పయాత్ర బృందం :కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగుతున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు వినతులు అందిస్తూ సమస్యలు విన్నవిం చారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రతిపక్ష నేతను కలిసి తమ వేదన వినిపించారు. నాలుగున్నరేళ్లుగా అధికార పార్టీ తమను పట్టించుకోవడం లేదంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
గిట్టుబాటు ధర కల్పించాలి..
వరిపంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోండి. ఎకరా వరి పంట సాగుకు రూ.20 వేలు ఖర్చు అవుతోంది. కనీసం 25 బస్తాలు దిగుబడి రావడం లేదు. బస్తా వెయ్యి రూపాయలకు మాత్రమే దళారులు అడుగుతున్నారు. కనీసం మా పెట్టుబడులు కూడా రావడం లేదు. రైతులంతా వలసపోతున్నారు. గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతను ఆదుకోవాలయ్యా..– పైల లక్ష్మణ, రైతు, కేశవరావుపేట, ఎచ్చెర్ల మండలం
ఆదుకోవాలన్నా..
కులాంతర వివాహం చేసుకున్న దంపతులకూ రాజకీయ వివక్ష తప్పడం లేదు. 2014 మే 22న బీసీ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకున్నాను. ఈ ఏడాది జనవరి 17న నా భర్త మరణించారు. ఇంత వరకు కనీసం వితంతు పెన్షన్, రేషన్కార్డు కూడా మంజూరు కాలేదు. నిరాధారంతో బతుకుతున్నాను. ఆదుకోవాలన్నా..– మడపాన దీప, ఎస్.ఎం.పురం, ఎచ్చెర్ల మండలం
నా కుమారుడ్ని హత్యచేశారు..
టీడీపీ నేతలు నా కొడుకును పగతో హత్య చేశారు. మేము వైఎస్సార్ సీపీ సానుభూతిపరులమని నా ఒక్కగానొక్క కుమారుడు బలగ కామేశ్వరరావును పొట్టనబెట్టుకున్నారు. ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. న్యాయం చేయాలి నాయనా..– బలగ కృష్ణమూర్తి,కొర్లాం గ్రామం, గార మండలం.
దళితులపై అక్రమ కేసులు
మా గ్రామంలోని దళిత కుటుం బాలపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. ఏ ప్రాంతంలో ఎటువంటి తగా దాలు జరిగినా మా గ్రామంలోని దళితులను అనుమానించి పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. దీంతో తీవ్ర మనోవేదన చెందుతున్నారు. సమస్య పరిష్కారానికి దృష్టి సారించాలి.– గొర్లె అప్పలనాయుడు, అదపాక, లావేరు మండలం
పోస్టులు భర్తీ చేయడం లేదు
రాష్టంలో లక్షా ఎనభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడం లేదు. ఎందరో నిరుద్యోగులు ప్రభు త్వ కొలువుల కోసం ఎదురుచూస్తున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా అందడం లేదు. మెస్చార్జీలకు దిక్కులేదు. నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.– సన్యాసి శ్రీధర్, వి.ఆర్.గూడెం, పొందూరు మండలం
సాగునీరు అందడం లేదు..
ఎచ్చెర్ల, లావేరు మండలాల పరిధి లోని భూములకు సాగునీరు అం దడం లేదు. వర్షాలు పడకపోతే పం టలు ఎండిపోతున్నాయి. మా భూములకు సమీపంలోనే నాగావళి, వంశధార నదులు, మడ్డువలస ప్రాజెక్టు ఉన్నా సాగునీటిని సరఫరా చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే స్థానిక సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలయ్యా....
– ఎ.సన్యాసి, రైతు, చిలకపాలెం